ఆ తర్వాతే: కేసీఆర్ కేబినెట్లోకి టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరలో తన మంత్రివర్గంలోకి తెలంగాణ టిడిపి నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి, తెరాసలో చేరిన ఎర్రబెల్లి దయాకర రావుకు చోటు కల్పించనున్నారని తెలుస్తోంది.
కేసీఆర్ ముగ్గురు నలుగురు మంత్రుల పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. త్వరలో వారికి ఉద్వాసన పలికి, మరికొందరిని తీసుకోవచ్చునని చెబుతున్నారు. ఇందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని అంటున్నారు. తెలంగాణ కేబినెట్లో సీఎంతో కలిసి 18 మంది ఉండవచ్చు.
చంద్రబాబు అటు వైసిపి నుంచి గెలిచిన వారిని తన కేబినెట్లోకి తీసుకున్న తర్వాత సమయం చూసి.. కొద్ది నెలల క్రితం టిడిపి నుంచి చేరిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావుకు కూడా కేసీఆర్ తన కేబినెట్లో చోటు కల్పించవచ్చునని అంటున్నారు.

ఎర్రబెల్లిని మంత్రివర్గంలోకి తీసుకుంటాననే హామీతోనే చేర్చుకున్నారనే వాదనలు ఉన్నాయి. ఆయనతో పాటు నల్గొండ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిలను కేబినెట్లోకి తీసుకోవచ్చునని చెబుతున్నారు.
అలాగే అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ కనీసం ముగ్గురు నలుగురు మంత్రుల పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారి పైన వేటు పడుతుందని అంటున్నారు.
ఇప్పటికే తలసాని ద్వారా కేసీఆర్ టిడిపి నేతల నుంచి, ఇతర పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు వైసిపి ఎమ్మెల్యేలను తన కేబినెట్లోకి తీసుకున్న తర్వాత.. ఎర్రబెల్లిని తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications