ఈఎస్ఐ స్కామ్..మాజీ డైరెక్టర్ దేవికారాణి ..అమరావతిని దున్నేశారుగా..విషయం తెలిస్తే షాక్
తెలంగాణ ఈఎస్ఐలో మెడిసిన్స్ కొనుగోలులో భారీ కుంభకోణం తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ప్రధాన సూత్రధారిగా మందులు, వైద్యపరికరాల కొనుగోలులో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అధిక ధరలకు కొనుగోలు చేసి సుమారు రూ.113 కోట్లకు పైగా కుంభకోణానికి తెర తీశారని విజిలెన్స్ అధికారులు గుర్తించటం ఆమెతో పాటు పలువురు కీలక పాత్రా పోషించిన వారిని సైతం అరెస్ట్ చెయ్యటం తెలిసిందే . అయితే ఈఎస్ఐ స్కామ్ లో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
తెలంగాణాలోనే కాదు ఆంధ్రాలో కూడా దేవికారాణి ఆస్తుల చిట్టా
అర్హతలు లేని ఏజెన్సీల నుంచి మందులు కొనుగోలు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారన్న కుంభకోణంలో ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక అప్పటి నుండి ఆమె ఆస్తుల చిట్టా సేకరించే పనిలో పడ్డారు. దేవికారాణి అక్రమంగా సంపాదించిన ఆస్తి ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు ఆంధ్రాలో కూడా భారీగానే ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. అమరావతితో పాటూ తిరుపతిలో కుటంబ సభ్యుల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు .
దేవికారాణి ఆస్తుల విషయంలో మూడో సారి సోదాలు జరిపేందుకు సిద్ధం అవుతున్న ఏసీబీ
ప్రభుత్వ ఆదేశాల మేరకు గత సెప్టెంబరులో మందులు కొనుగోలులో ప్రభుత్వ సొమ్మును కాజేశారన్న కుంభకోణంలో ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిపై కేసు నమోదు చేసిన ఏసీబీ దేవికారాణి ఆమె భర్త గురుమూర్తితోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న 19 మంది ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే రెండుమార్లు సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. తాజాగా మూడోసారి సోదాలు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే 113 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ ..
దేవికారాణికి సంబంధించి ఇప్పటికే రూ.113కోట్లు ఆస్తులు గుర్తించగా ఈ ఆస్తుల చిట్టా ఇంకా పెరిగిపోతుంది.స్థిరాస్తులలో షేక్పేట్ వద్ద విలాసవంతమైన విల్లా, ఆదిత్య ఎంప్రెస్ టవర్స్లోని మూడు ఫ్లాట్లు, సోమాజిగూడలో ఒక ఫ్లాట్ సోమాజిగూడలో ఆర్ఆర్ఎస్ టవర్స్లో, తిరుపతిలో బహుళ అంతస్తుల భవనం, రాజేంద్ర నగర్లో ఇల్లు, వైజాగ్లోని ఇండిపెండెంట్ ఇల్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 11 ఓపెన్ ప్లాట్లు, 32 ఎకరాల వ్యవసాయ భూమి మరియు నగరంలో 16 వాణిజ్య దుకాణాలు ఉన్నట్టు గుర్తించారు.
అమరావతిలోనూ భారీగానే ఆస్తులు
దేవికారాణి తాను అక్రమంగా సంపాదించిన ధనాన్ని రాష్ట్రం విడిపోయిన తరువాత అమరావతిలో పెట్టుబడులుగా పెట్టారు. తన పిల్లల పేరిట 9 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే అల్లుడి పేరు మీద తిరుపతిలో 700 గజాల్లో జీ ప్లస్ ఫోర్ అపార్ట్ మెంట్ ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు . రావిరాల హౌసింగ్ బోర్డులో ఒక ఇంటికి రూ.25 లక్షలు అడ్వాన్స్ చెల్లించినట్లు గుర్తించారు.
లోతుగా దర్యాప్తు .... తవ్విన కొద్దీ ఆస్తుల చిట్టా
అయితే దేవికారాణికి సంబంధించి కూడా ఏపీలో ఆస్తులు బయటపడటం ఇప్పుడు అధికార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆమె ఆస్తులపై లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులకు తవ్విన కొద్దీ ఆస్తుల చిట్టా బయటపడుతుంది. ఏసీబీ తనిఖీల్లో కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు బ్యాంకులు బీమా సంస్థల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లను గుర్తించారు అధికారులు .ఇక ఆమె ఏపీలో కూడబెట్టిన ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. దీంతో అక్కడ ఆస్తుల చిట్టా కూడా షాక్ కు గురిచేస్తుంది.