బీజేపీ-టీఆర్ఎస్ మైత్రిపై ఈటల రాజేందర్ సందేహాలు: జేపీ నడ్డా క్లారిటీ, ఇక లైన్క్లియర్, త్వరలో..
న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడటం, భారతీయ జనతా పార్టీలో చేరడం దాదాపు ఖరారైపోయింది. ఈ క్రమంలో సోమవారం బీజేపీ జాయతీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం ఈటల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకున్న పలు సందేహాలను నడ్డా ముందుంచారు. టీఆర్ఎస్ బీజేపీ సంబంధాలు, బీజేపీలో తన పాత్రపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
బీజేపీలో ఈటలకు సముచిత స్థానం..
రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ పోరు కొనసాగుతుందని జేపీ నడ్డా.. ఈటల రాజేందర్కు స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతేగాక, బీజేపీలో ఈటలకు సముచిత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించిన అనంతరం.. పార్టీలో చేరికపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని జేపీ నడ్డా.. ఈటలకు సూచించినట్లు తెలిసింది.
బీజేపీ-టీఆర్ఎస్ మైత్రిపై ఈటల సందేహాలు
రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రహస్య మైత్రి కొనసాగుతోందనే భావన రాజకీయంగా ఉంది. అందుకు తగినట్లుగానే టీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరిస్తోంది. మొదట కేంద్ర ప్రభుత్వ పథకాలపై కేసీఆర్ విమర్శిస్తారు. ఆ తర్వాత అమలు చేస్తారు. ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాల విషయంలో ఇదే జరిగింది. భవిష్యత్తులో టీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపితే బీజేపీని నమ్మి వచ్చే తమలాంటి వారి పరిస్థితి ఏంటి అని జేపీ నడ్డాతో ఈటల చర్చించినట్లు తెలుస్తోంది. అంతేగాక, రాష్ట్ర ప్రభుత్వంపై అనేక అక్రమాలకు పాల్పడుతుందన్న ఆరోపణలున్నప్పటికీ.. కేంద్రం ఒక్క విచారణకు ఆదేశాలు జారీ చేయకపోవడం సందేహాలకు తావిస్తోందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
జేపీ నడ్డా క్లారిటీ ఇవ్వడంతో త్వరలో బీజేపీలోకి ఈటల..
ఈటల సందేహాలకు జేపీ నడ్డా సమాధానం చెప్పారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మూడు స్థానాల నుంచి అధికారం చేపడతామనే వరకు ఎదిగినట్లు తెలిపారు. తెలంగాణలోనూ అంతకుమించి దూకుడు ఉంటుందని, టీఆర్ఎస్ అక్రమాలపై తగిన సమయంలో స్పందిస్తామని అన్నారు. కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎందుకు విమర్శిస్తున్నారో.. ఆ తర్వాత ఎందుకు అమలు చేస్తున్నారో రాష్ట్ర ప్రతిపక్షాలే ప్రశ్నించాలని అన్నారు. అంతేగాక, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టనుందని జేపీ నడ్డా స్పష్టం చేసినట్లు తెలిసింది. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు అవమానం జరుగుతోందన్న ఈటల.. బీజేపీలో చేరికపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతలతో ఈటల భేటీలు
అంతకుముందు బీజేపీలో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో ఈటల రాజేందర్ రెండ్రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్లతో కలిసి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి జేపీ నడ్డాను ఢిల్లీలో ఆయన నివాసంలో కలిశారు. ఆ తర్వాత సుమారు గంటపాటు వీరి సమావేశం జరిగింది. అనంతరం తరుణ్ చుగ్ ఇంటికి వెళ్లిన బండి సంజయ్, ఈటల రాజేందర్, రవీందర్ రెడ్డి, వివేక్లు.. అక్కడే రాత్రిపూట భోజనం చేశారు. మంగళవారం కూడా ఈటల ఢిల్లీ పర్యటన కొనసానుండటంతో మరికొందరు బీజేపీ జాతీయ నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ వారంలోనే ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈటల రాకను వ్యతిరేకిస్తున్న పెద్దిరెడ్డిని బీజేపీ నేతలు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.