సిటీలో విషాదం: పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని కండోజీబజార్లో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. బెంగాల్కు చెందిన ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు ఘోష్పార గ్రామం డోంజార్, హౌరాకు చెందిన స్వరూప్ గోపాల్ దాస్(37) కొన్నేళ్ల కిత్రం నగరానికి వలస వచ్చాడు. ఆయనకు భార్య దీప (30) ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇందులో పెద్ద కుమార్తె టిట్లీ దాస్ (5) పార్క్లేన్లోని బీఆర్జేసీ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతోంది. మరో కుమార్తెకు ఐదు నెలలు.
స్వరూప్ గోపాల్ దాస్ జనరల్ బజార్లో గోల్డ్స్మిత్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం విమల్ అనే వ్యక్తి తాను ఇచ్చిన నగల కోసం ఫోన్ చేస్తున్నాడు. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు షాప్కు వస్తున్నానంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. కానీ, సాయంత్రం వరకు రాకపోవడంతో విమల్ స్వరూప్ ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో గడియ పెట్టి ఉండటంతో వెనక్కి వెళ్లి పోయాడు.
శుక్రవారం సాయంత్రం మరో సారి వచ్చి చూడగా ఇంట్లో పెద్దగా టీవీ శబ్ధం వస్తుందే తప్ప ఎవరూ పలకడం లేదు. దీంతో రాత్రి 8 గంటల సమయంలో విమల్ మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఇన్స్పెక్టర్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని కిటీకి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా నలుగురు విగత జీవులుగా పడివున్నారు. పోలీసులు మృతదేహాలను గాంధీ మార్చురికీ తరలించారు. మహంకాళీ ఏసీపీ వినోద్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కాగా, స్వరూప్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీంతో పోలీసులు బెంగాల్కు చెందిన పలువురిని తీసుకుని వచ్చి మృతుల వివరాలను ఆరా తీస్తున్నారు. మృతదేహాల వద్ద సైనైడ్ లాంటిది పడివుండటంతో దాన్ని మింగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని బావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.