రుణాల రీషెడ్యూల్ కష్టమే, కొద్ది రోజుల్లో: పోచారం
హైదరాబాద్: రంగారెడ్డి, మెదక్, అదిలాబాద్ జిల్లాల్లో వంద మండలాల్లోని రైతులందరికీ రుణాల రీషెడ్యూలు చేయడం కష్టంగా ఉందని, పట్టణ బ్యాంకుల్లో బంగారు రుణాలకు వెసులుబాటు ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం చెప్పారు. పంట రుణాల మాఫీపై రెండు, మూడు రోజులలో స్పష్టత వస్తుందన్నారు. పంట రుణ మాఫీపై మంత్రి పోచారం అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమైంది.
మంత్రివర్గ ఉపసంఘం మరో రెండు, మూడుసార్లు సమావేశమై విధి విధానాలను ఖరారు చేస్తుందని సచివాలయంలో బుధవారం మంత్రి అన్నారు. పంట రుణాలను మాఫీ చేస్తామని, దీనిపై ఎలాంటి అపోహలకు తావులేదన్నారు. రుణమాఫీ చేసే పనిలోనే ప్రభుత్వం నిమగ్నం అయిందన్నారు. గతంలో పంట రుణాలను కేవలం వంద మండలాలలోనే చేశారని, తమ ప్రభుత్వం మాత్రం ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు పంట రుణాలను రాష్టవ్య్రాప్తంగా మాఫీ చేస్తుందన్నారు.
పంట రుణాలు మాత్రమే కాకుండా వ్యవసాయ ఆధారిత పనుల కోసం తీసుకున్న రుణాలను కూడా తమ ప్రభుత్వం మాఫీ చేయబోతుందన్నారు. బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలనూ మాఫీ చేస్తామని, అయితే వ్యవసాయానికి తీసుకున్న రుణాన్ని గుర్తించడానికి బ్యాంకులు వసూలు చేసిన వడ్డీని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
వ్యవసాయ రుణాలకు మాత్రమే బ్యాంకర్లు ఏడు శాతం వడ్డీని వసూలు చేస్తారని, వాటిని మాత్రమే పంట రుణాలుగా గుర్తించి మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికే రుణమాఫీకి సంబంధించిన సమాచారం అన్ని జిల్లాల నుంచి అందిందని, 34 లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ కానున్నాయన్నారు. ఇలా ఉండగా అంతకుముందు ఇజ్రాయెల్ అధికారుల బృందం మంత్రి పోచారంతో భేటీ అయింది. ఇజ్రాయెల్లో భూగర్భ జలాలు లేకపోయినా అతి తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ అక్కడ ఆహార, వాణిజ్య పంటలను రైతలు రికార్డు స్థాయిలో పండిస్తున్నారని మంత్రి తెలిపారు.