ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరిన ఈటల-వెంట వెళ్లిన నేతలు వీరే-నేడే బీజేపీలో చేరిక
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ బయలుదేరారు. సోమవారం(జూన్ 14) ఉదయం 6.30గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈటల వెంట బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి,మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ,గండ్ర నళిని,తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మాజీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి తదితరులు ఉన్నారు. అనుచరులు కూడా భారీ ఎత్తున ఈటలతో కలిసి ఢిల్లీ వెళ్తున్నారు.
ఈటల శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో బీజేపీ నేత వివేక్ మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రాన్ని కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబ రాష్ట్రంగా మారుస్తున్నారు. ఉద్యమకారుల గొంతు కోసి అన్ని పోస్టుల్లో కుటుంబ సభ్యులనే ముందు పెడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలనపై ప్రజా పోరాటం మొదలైంది. ఈటలను తప్పుడు ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంతోమంది ఎమ్మెల్యేలు,మంత్రులపై మాత్రం చర్యలు తీసుకోవట్లేదు.' అని వివేక్ పేర్కొన్నారు.
ఈటల బీజేపీలో చేరడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందన్నారు. కాంగ్రెస్ టికెట్పై గెలిచి టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కోవాలన్నారు.
కాగా,ఢిల్లీలో ఈ ఉదయం 11గంటలకు బీజేపీ జాతీయ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారు.ఆయనతో పాటు మొత్తం 20 మంది వరకు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మొదట పార్టీ కార్యాలయంలో సభ్యత్వం తీసుకోనున్న ఈటల... ఆపై నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ప్రస్తుతం బండి సంజయ్ ఢిల్లీలోనే ఉండగా... జమ్మూకశ్మీర్లో ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు.
పార్టీలో చేరిక అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఈటల కలవనున్నారు. ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ఈటల.. మంగళవారం(జూన్ 15) తిరిగి శామీర్పేట్లోని తన నివాసానికి చేరుకోనున్నారు. ఇక రేపటి(జూన్ 15) నుంచి హుజురాబాద్ ఉపఎన్నిక పైనే ఆయన ఫోకస్ చేయనున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి వ్యూహాలు రచించనున్నారు. దాదాపు గత 20 ఏళ్లుగా హుజురాబాద్లో తనను గెలిపిస్తున్న ప్రజలు.. ఈసారి కూడా తన వెంటే నిలుస్తారని ఈటల ధీమాతో ఉన్నారు.