కొడుకు కిడ్నాప్ కు గురయ్యాడని,మనోవేదనతో తండ్రి మృతి
హైదరాబాద్ :అల్లారుముద్దుగా పెంచుకొన్న కొడుకు కిడ్నాప్ కు గుయ్యాడు. కొడుకు ఆచూకీ కోసం వెతికి వెతికి మనోవేదనకు గురైన తండ్రి గుండెపోటుతో మరణించాడు. తండ్రి మరణించాక కొడుకు ఆచూకీ తెలిసింది. పిల్లాడిని కిడ్రాప్ చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకొంది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది. వినాయక్ నగర్ కు చెందిన టి.నరేందర్, టి. మాలతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయన ఓ టైర్ల కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు నాగచైతన్యకు 18 నెలల వయస్సు.
శుక్రవారం రాత్రి సమయంలో నాగచైతన్య ఇంటి ముందుకు ఆడుకొంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు నాగచైతన్యకు కిడ్నాప్ చేశారు.నాగచైతన్య ఆచూకీ కోసం కుటుంబసభ్యులు, పోలీసులు గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. అర్థరాత్రి వరకు కొడుకు ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో నరేందర్ మనోవేదనకు గురయ్యాడు.
కొడుకును వెతికి ఇంటికి వచ్చి కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే ఆయన చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు.కొడుకు ఆచూకీ దొరకలేదు. భర్త చనిపోయాడు. ఆ ఇల్లాలు కన్నీరుమున్నీరుగా రోధించింది. భర్త అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త అంత్యక్రియలు పూర్తైన కొద్దిసేపటికే కొడుకు ఆచూకీ తెలిసిందని పోలీసులు సమాచారం ఇచ్చారు ఆమెకు.
ఉడ్డెంగడ్డ ని కల్లు కంపౌండ్ కు కల్లు తాగేందుకు వచ్చిన కవిత అనే మహిళ నాగచైతన్యను కిడ్రాప్ చేసింది. నాగ చైతన్యను ఇతరులు గుర్తించకుండా ఉండేందుకు ఆయన చొక్కాను విప్పి రోడ్డు పక్కన పడేసింది. ఈ దృశ్యాలు మైఫిల్ హోటల్ ప్రాంతంలో ఉన్న సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటిని పోలీసులు గుర్తించి నరేందర్ కుటుంబసభ్యులకు చూపారు. ఈ చొక్కా తన కొడుకు చైతన్యదేనని తల్లి మాలతి చెప్పింది.
సిసి కెమెరాలో ఉన్న మహిళ ఆచూకీని స్థానికుల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆ మహిళను కవితగా గుర్తించారు. ఆమె ఉపయోగిస్తున్న సెల్ ఫోన్ ఆధారంగా ఆమెను గుర్తించారు పోలీసులు. అప్పటికే కవిత తాను పనిచేస్తోన్న బాంటియా గార్డెన్ సూపర్ వైజర్ రాముకు చైతన్యను 20 వేల రూపాయాలకు విక్రయించింది.రాముకు ముగ్గురు ఆడపిల్లలే కావడంతో ఆయన మగపిల్లాడిని కొనుగోలు చేశాడు.
పురానాపూల్ లో ఉన్న రాము ఇంటికి వెళ్ళి చైతన్యను మాలతికి అప్పగించారు పోలీసులు చైతన్యను కిడ్నాప్ చేసి కవిత స్వంత కొడుకును కూడ విక్రయించింది. మూడేళ్ళ క్రితం తన కొడుకు 20 వేల రూపాయాలకు విక్రయించింది. మొదటి భర్తతో విడిపోయి ప్రస్తుతం మహేష్ గౌడ్ అనే వ్యక్తితో ఆమె ఉంటుంది. ఎట్టకేలకు మాలతి కొడుకు ఆమెకు దక్కాడు. అయితే ఆమెకు కొడుకు దక్కినా భర్త మాత్రం చనిపోయాడు.