అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి.. ఎక్కడంటే ?
హైదరాబాద్ నగరంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మియాపూర్లో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలంగా మారింది. ఈరోజు ( ఆగస్టు 21, 2025 )ఉదయం పక్కింటి వారు ఈ ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మృతులు ఎవరు?
మృతులను కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి మియాపూర్లో స్థిరపడ్డట్టు చెబుతున్నారు. చనిపోయిన వారిలో లక్ష్మయ్య (60), ఆయన భార్య వెంకటమ్మ (55), అల్లుడు అనిల్ (40), కూతురు కవిత (38), మనవరాలు అప్పు (2) ఉన్నారు.

ఆత్మహత్యా? హత్యా?
ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు ఇది ఆత్మహత్యగా భావిస్తున్నా, హత్య కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు అనుమానిస్తున్న మేరకు - ముందుగా చిన్నారి అప్పును చంపి, అనంతరం పెద్దవారు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే దీనికి గల నిజమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. కుటుంబ సభ్యుల మృతి వెనుక ఆర్థిక సమస్యలేనా? లేక వేరే కారణమా? అనేదానిపై విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబం ప్రశాంతంగా జీవించేదని, పెద్దగా ఎలాంటి గొడవలు జరగలేదని పొరుగు వారు చెబుతున్నారు. ఇటువంటి విషాద ఘటన జరిగి ఐదుగురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు తీవ్ర షాక్కు గురయ్యారు.
ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఎవరైనా మానసిక ఒత్తిడికి గురయ్యారా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? అనే అంశాలపై కూడా విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications