కేసీఆర్..చావునైనా భరిస్తా, నిన్ను క్షమించ -వైఎస్సార్కే భయపడలే, రాజీనామా చేస్తా -గుట్టు విప్పిన ఈటల రాజేందర్
నాణేనికి రెండు వైపుల్లాగా, మనిషి అనేవాడికి కర్కషత్వం, కారుణ్యం రెండూ ఉంటాయని, అయితే ఎదుటివాడిపై ఉక్కుపాదం మోపుతున్నప్పుడు ఎవరు, ఏమిటన్నది కనీసం గుర్తుచేసుకోవడం మానవ సహజమని, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ లో అలాంటి లక్షణం లోపించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. భూకబ్జా ఆరోపణలపై మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత సోమవారం తొలిసారిగా మీడియా ముందుకొచ్చిన ఈటల.. కేసీఆర్ తో అనుబంధం, ప్రస్తుత వివాదానికి కారణాలు, పార్టీలో అంతర్గత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణలపై వివరణలిచ్చారు. ఈటల రాజేందర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

ఏనాడూ చెడ్డపేరు తేలేదు..
''కేసీఆర్ తో నాకు 20 ఏళ్లుగా అనుబంధముంది. నాడు ఉద్యమ నేతగా, తర్వాతి కాలంలో మంత్రిగా ఏనాడూ పార్టీకిగానీ, కేసీఆర్ కు గానీ చెడ్డపేరు తెచ్చే పనులు చేయలేదు. పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడే పోటీచేశా, సొంత నేతలే పక్క పార్టీలకు అమ్ముడుపోయినా, నేను మాత్రం కేసీఆర్ పక్కనే నిలబడ్డా. నా కమిట్మెంట్ నచ్చబట్టే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ దాకా, తెలంగాణ వచ్చాక మంత్రిగా నాకు కేసీఆర్ అవకాశాలిచ్చారు. ఆనాడు ప్రజల్ని, ధర్మాన్ని నమ్మి బయలుదేరిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం కనీస మానవత్వం లేనట్లుగా వ్యవహరిస్తున్నడు..

సీఎం తీరు సరిగా లేదు..
ఆనాడు అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించిన కేసీఆర్.. ఆయనతో 20 ఏళ్లు కలిసి బతికిన నాపైనే అతి క్రూరంగా వ్యవహరిస్తున్నడు. బడుగుజీవి ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్నే మోహరించిండు. సీఎం తన శక్తి కొద్దీ ఏసీబీ, రెవెన్యూ, ఫారెస్ట్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లను రంగంలోకి దించిండు. కాని బాధితులను ఆయన స్వయంగా పిలిపించుకుని నాపై కుట్రపూరితంగా ప్రచారాలు చేయిస్తున్నరు. అయ్యా కేసీఆర్.. ఇది నీ స్థాయికి ఏమాత్రం తగనిది. ఇలాంటి అణిచివేతలతో నీ గౌరవం ఇంత కూడా పెరగదు. ఎండాకాలం మంచి నీళ్లు తాగినా.. అదిగో నీళ్లు నములుతున్నాడని తప్పుడు ప్రచారం చేయించే తీరు అసలేమాత్రం సరికాదు..

సర్కారుపై న్యాయపోరాటం చేస్తా..
ఉద్యమ సమయం నుంచే నీ అడుగులో అడుగులా ఉంటూ, 24బై7 నీతోనే రోడ్లపైనో, జనం మధ్యలో ఉన్నం. ఆ సమయంలో మా కుటుంబాల గురించి పట్టించుకోలే. అంతెందుకు గడిచిన 20 ఏళ్లలో వ్యక్తిగతంగా నేను వ్యాపారాలపై దృష్టికూడా పెట్టలేదు. తెలంగాణలో మహిళా పారిశ్రాకవేత్తలకు, ఆంత్రప్రెన్యూర్స్ కు ఆదరణ ఉంటుందనే నమ్మకంతో నా భార్య, నా కొడుకు మా పౌల్ట్రీ వ్యాపారాన్ని పెంచుదామనుకున్నారు. నిబంధనల ప్రకారంమే ముందుకెళ్లాం తప్ప అవినీతికి పాల్పడలేదు. అయినాసరే ఏదో కబ్జాలు జరిగిపోయాయని ప్రచారం చేసిన్రు. కలెక్టర్ తో విచారణ చేయించి, మంత్రి పదవి ఊడబీకిన్రు. మీ ఆరోపణలే నిజం అనుకున్నా, భూమికి సంబంధించినవాళ్లు లేకుండా, వందలాది మంది పోలీసుల్ని పెట్టి మీకు మీరే కొలతలు తీసుకునుడు చట్టవిరుద్ధం కాదా, కనీసం 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా, ఏకపక్షంగా చర్యలకు దిగడం నిబంధనలకు విరుద్దం. ఎమ్మార్వో చేయాల్సిన పనిని కలెక్టర్ చేయడం అంతకంటే అసంబద్దం. దీన్ని బట్టే మీ కుట్రల బుద్ది ఏందో అర్థమైతోంది. ఈ చట్టవ్యతిరేక విధానాలపై నేను న్యాయపోరాటం చేస్తా. అయితే..

నేనూ మీ శిష్యుడినే కదా..
రాజ్యం చాలా శక్తిమంతమైనదని, ఎవరినైనా అరెస్టు చేసే అధికారం, ఎవరిని ఏదైనా చేసే బలం ఉంటుందని మీరు పదే పదే చెప్పే మాటలు మాపైనే ప్రయోగిస్తున్నారు. కేసీఆర్ అనుకుంటే ఎవడినైనా ఆగం పట్టించేదాకా నిద్రపోడని నాకు తెలుసు. అందుకే ఏకపక్షంగా కేసులు, బర్తరఫ్ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడేమో ఇంటి చుట్టూ వందలమంది పోలీసుల్ని పెట్టి, ఇంకా పెద్ద కేసుల్లో నేడో రేపో అరెస్టు చేస్తామనే భయాందోళనలను వ్యాపింపజేస్తున్నారు. గతంలో నేను పౌరసరఫరాల మంత్రిగా చేశాను కాబట్టి, పేదలకు బియ్యం కోసం కేంద్రంతో ఏవైనా సంప్రదింపులు జరిపుంటే, వాటిలో తప్పులు పట్టే అవకాశాల కోసం కూడా ఎదురుచూస్తుండొచ్చు. అయితే, మీ శిశ్యరికంలో పెరిగిన వ్యక్తిగా నేనొక మాట చెప్పదల్చుకున్నా. మీరు కళ్లు తెరిచి చూడండి.. ఈ రాష్ట్రంలో ఎన్ని వేల కంపెనీలకు ఎన్ని లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లో దారుల్లో వెళ్లాయో, ఎర్రవల్లిలోని మీ ఫామ్ హౌజ్ కు ఎన్ని అసైన్డ్ భూములు దారితీస్తాయో ఒక్కసారి పరిశీలించుకోండి. నేను కోళ్ల ఫారం పెట్టిన తర్వాతే ఊళ్లు బాగుపడి, భూములకు ధరలొచ్చినయని జనమే చెబుతున్నారు. సర్పంచ్ టీవీల్లో నిజం మాట్లాడితే, బెదిరించి మళ్లీ అబద్ధాలు చెప్పించారు. నా మీద ఎంత ద్వేషముంటే ఇట్ల చేస్తారు...

వైఎస్సార్కే భయపడలేదు.. నీకా?
కేసీఆర్.. వ్యక్తులు, పార్టీలూ వస్తుంటాయ్, పోతుంటాయ్. అణిచివేతకు దిగితే ఆయా వ్యక్తులు, పార్టీలకు ఎలాంటి గతి పడుతుందో నిన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనే తాజాగా చూశాం. ప్రజలు, ధర్మం అనేవే శాశ్వతంగా ఉంటాయి. ఆంత్రప్రెన్యూరైన నా భార్య పట్ల ఇదేనా నువ్వు వ్యవహరించే తీరు? ఏం? నువ్వేమైనా వెయ్యేళ్లు ఏలుతావా? ఉద్యమ సమయంలోనే ప్రాణత్యాగానికి సిద్దపడ్డ వ్యక్తిని నేను, గ్యాంగ్ స్టర్ నయీంగాడి బెదిరింపులకే భయపడలేదు. నాకు కమిట్మెంట్ ఉంది కాబట్టే బలవంతుడైన వైఎస్సార్ ను సైతం తట్టుకుని కేసీఆర్ గొంతుకగా నిలబడ్డాను. నేను కుదువపెట్టిన భూమిలో ఆఫీసు కట్టుకున్న నమస్తే తెలంగాణ పత్రిక ఇవాళ నాపైనే అబద్ధపు రాతలు రాయడం దుర్మార్గంకాక మరేంటి?

నిన్ను క్షమించే ప్రసక్తేలేదు..
నా ఒక్కడి మీదున్న కోపంతో చుట్టుపక్కల భూముల వాళ్లందరినీ ఇబ్బందులకు గురిచేయోద్దని సీఎంను కోరుతున్నా. నాకు ఆస్తులు ఊరికే రాలేదు. మా కుటుంబం 1986నుంచీ పౌల్ట్రీ వ్యాపారంలో ఉంది. అదేమీ అల్లాటల్లా బిజినెస్ కాదు. గతంలో చౌక ధరకు కొన్న భూముల ధరలు పెరిగితే కూడా అక్రమాలకు పాల్పడినట్లేనా? మంత్రులు కావాలనో, పదవులు పొందాలనో ఆనాడు మీతో కలిసిరాలేదు. కమిట్మెట్ కోసం వచ్చాం. ఇప్పటిదాకా దాన్నే పాటిస్తున్నాం. మనుషుల మీద ఉక్కుపాదం పెడుతున్నప్పుడు మేం ఎవరో గుర్తురావాలి కదా, మాతో అనుబంధం ఏదో, పేగులు తెగేలా చేసిన పోరాటమైనా గుర్తురావాలి కదా. మ్యాగ్జిమం నన్ను జైలులో ఎన్ని రోజులు పెడతావ్? దమ్ముంటే నా మొత్తం ఆస్తులు, సంపాదన మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించొచ్చుకదా. పెట్టుకో, నీకు ఇష్టమొచ్చినన్ని కేసులు పెట్టుకో, దేనికైనా నేను సిద్ధం. ఆస్తులు, సంపాదన అంతా పోగొట్టుకోడానికి నేను వెనుకాడను, ఆఖరికి చావునైనా భరిస్తా. కానీ ఆత్మగౌరవంతోనే బతుకుతా. నిన్ను క్షమించడానికి నేను రుషిని కాను.

మంత్రులను మనుషులుగా చూడయ్యా..
ఇవాళ నేను ఒంటరిని కావొచ్చు. నాతో ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడకపోవచ్చు. మంత్రులెవరూ నాకు సానుభూతి తెలపకపోవచ్చు. కానీ ఇవన్నీ ప్రజలు చూస్తుంటారు. మేము నీకు ఎందుకు దూరమైనమో మీ అంతరాత్మకు తెలుసు. మంత్రులను మంత్రుల్లాగా చూడకపోయినా పర్వాలేదు.. కనీసం మనుషుల్లాగానైనా చూడమని కోరుతున్నా. మీ దగ్గరున్న మంత్రులెవరూ ఆత్మగౌరవంతో ఉన్నామని చెప్పుకోలేరు. ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ మేం గౌరవంగా బతుకుతున్నామని అనలేరు. దాదాపు అన్ని పార్టీలూ ఇట్లనే పాడైనై కాబట్టి ఇంకా లోతైన విషయాలు చెప్పలేను. ప్రజలు నాకోసం హైరానా పడుతున్నరు. నేను జనంలోకే వెళతా. కారు గుర్తుపై గెలిచావని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తా. కచ్చితంగా చేస్తా. నన్ను ఇన్నేళ్లుగా ఆదరిస్తోన్న ప్రజల దగ్గరికే వెళ్లి మాట్లాడుతా. వాళ్లు చెప్పినట్లే నడుచుకుంటా. ప్రజల బిడ్డగానే తదుపరి నిర్ణయాలు తీసుకుంటా..'' అని ఈటల రాజేందర్ చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications