పక్కా ప్లాన్తో..: ముప్పుతిప్పలు పెట్టిన నయీంను ఎన్కౌంటర్ చేశారిలా..
హైదరాబాద్: పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్ స్టర్ నయీంను ఎట్టకేలకు గ్రేహౌండ్స్ మట్టుబెట్టాయి. సోమవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్లోని మిలీనియం టౌన్షిప్లో తలదాచుకున్న నయీంను పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమార్చారు.
నయీంతో పాటు మరో ఇద్దరు కూడా మృతి చెందారని చెబుతున్నప్పటికీ, అధికారులు నిర్ధారించాల్సి ఉంది. భూదందాలు, సెటిల్మెంట్లతో పోలీసులకు నయీం కొరకరాని కొయ్యగా మారాడు. నయీం పైన చాలాకాలం క్రితమే పోలీసులు దృష్టి సారించారని తెలుస్తోంది.
నయీమ్ను పట్టుకునేందుకు కొన్ని నెలల క్రితమే గ్రేహౌండ్స్ రంగంలోకి దిగాయి. ఇటీవలే నయీమ్ మహారాష్ట్రలో ఉన్నాడన్న సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు అక్కడికి కూడా తరలివెళ్లాయి. అయితే నయీం వారికి చిక్కలేదు. తిరిగి వచ్చిన గ్రేహౌండ్స్ బలగాలు సమాచారం కోసం ఎదురుచూశాయి.
ఈ క్రమంలో షాద్ నగర్కు నయీం వచ్చాడన్న పక్కా సమాచారం వచ్చింది. దీంతో గ్రే హౌండ్స్ రంగంలోకి దిగింది. పక్కా ప్లాన్తో సోమవారం ఉదయం నయీం తలదాచుకున్న భవనాన్ని గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారు.
అప్పటికే పోలీసుల రాక నయీంకు తెలిసింది. దీంతో అతడి గన్మన్ పోలీసుల పైకి కాల్పులకు దిగాడు. నయీంను అరెస్ట్ చేసేందుకే పోలీసులు అక్కడికి వెళ్లినప్పటికీ... అతడి గన్మన్ కాల్పులకు దిగడంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో నయీం హతమయ్యాడు.
ట్విస్ట్: షాద్నగర్లో ఉగ్రవాదులు కాదు... నయీం హతం, ఎవరితను? (పిక్చర్స్)
నయీం హత్య పైన ప్రత్యక్ష సాక్షులు స్పందిస్తూ.. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఫైరింగ్ జరిగిందని, ఆ చప్పుడు తాము విన్నామని, డెడ్ బాడీ పడి ఉందని, ఆ బాడీ నయీందని అని చెబుతున్నారని అంటున్నారు.
నిజామాబాద్ వ్యాపారి నుంచి రూ.కోటి డిమాండ్
నిజామాబాద్కు చెందిన ఓ వ్యాపారి నుంచి నయీం కొద్ది రోజుల క్రితం రూ.కోటి డిమాండ్ చేశాడు. షాద్ నగర్కు డబ్బులు తెచ్చివ్వమని నయీం అతనికి చెప్పాడు. సదరు వ్యాపారి షాద్ నగర్ తెచ్చి డబ్బులు ఇచ్చాడు. ఈ డబ్బులు తీసుకునేందుకు వారు ఆదివారం సాయంత్రం షాద్ నగర్ వచ్చారు. పోలీసులకు విషయం తెలిసింది. డబ్బు తీసుకొని వెళ్తుండగా.. వారు పోలీసుల కంట పడ్డారు. ఆ సమయంలో నయీం డ్రైవర్ పారిపోయాడు.