సింగరేణి గనిలో విషాదం: పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి
ఆదిలాబాద్: సింగరేణి బొగ్గు గనిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని ఎస్ఆర్పీ 3 గనిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బొగ్గు శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భారీ శిథిలాలు కావడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు. మరో ఒకటి రెండు గంటల సమయం పట్టే అవకాశముందని కార్మికులు అంటున్నారు. కాగా, ఈ ప్రమాదంపై సింగరేణి కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మొదటి షిఫ్ట్లో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సింగరేణి అధికారులు తెలిపారు. మైన్లో బొగ్గు వెలికి తీస్తుండగా 21 డీప్ 24 లెవెల్ వద్ద రూఫ్ కూలడంతో ప్రమాదం జరిగినట్లుగా వెల్లడించారు.
మృతి చెందిన కార్మికులు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లక్ష్మయ్య, చంద్రశేఖర్లుగా గుర్తించారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాలను వెలికితీశారు.
గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై గుర్తింపు కార్మిక సంఘం, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలకు టీబీజీకేఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా రక్షణ చర్యలు పటిష్టం చేయాలని అధికారులను కోరారు.
కార్మికుల మరణం పట్ల మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్మికుల మృతి దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. మరోవైపు, గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై సింగరేణి సంస్థ సీఅండ్ఎండీ ఎన్ శ్రీధర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదికనివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ అండగా ఉంటుందని తెలిపారు. కంపెనీ తరపున చెల్లించాల్సిన పరిహారాన్ని తక్షణమే వారి కుటుంబసభ్యులకు అందజేయాలని ఆదేశించారు.
Recommended Video
కాగా, సింగరేణి కార్మికులు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్షణమే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కార్మికుల భద్రత విషయంలో తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.