ములుగులో దారుణం... యువతిపై గ్యాంగ్ రేప్... బైక్పై వెళ్తున్న జంటను బెదిరించి...
ములుగు జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్పై వెళ్తున్న జంటను బెదిరించి... యువతిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అత్యాచార సమయంలో వీడియో తీశామని... ఈ విషయం బయటకు చెబితే దాన్ని లీక్ చేస్తామని దుండగులు బెదిరించినట్లు సమాచారం. దీంతో మౌనంగా ఉండిపోయిన బాధితురాలు... స్నేహితులు ధైర్యం చెప్పడంతో ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్చి 30న జరిగిన ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగింది...
ములుగు జిల్లాలోని తాడ్వాయి అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలను వీక్షించేందుకు మార్చి 30న ఓ జంట బైక్పై అక్కడికి బయలుదేరింది. అయితే మార్గమధ్యలో అటవీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఆ జంటను అడ్డగించారు. బైక్ టైర్లలో గాలి తీసి... యువకుడిని బెదిరించి ఫోన్ లాక్కున్నారు. ఆపై యువతిని బెదిరించి బలవంతంగా తమ బైక్పై ఎక్కించుకున్నారు. అటవీ ప్రాంతంలోనే ఓచోట ఆమెపై గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు.
ఇలా వెలుగులోకి.. నిందితుల అరెస్ట్...
యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిపోయిన నిందితులు బాధితురాలిని బైక్పై ఎక్కించుకుని ఆమె స్వగ్రామంలో వదిలిపెట్టారు. అత్యాచార సమయంలో వీడియో తీశామని... ఈ ఘటన ఎవరికైనా చెబితే దాన్ని బయటకు లీక్ చేస్తామని బెదిరించారు. దీంతో బాధిత యువతి జరిగిన ఘటన గురించి ఎవరితో చెప్పలేదు. అయితే ఇటీవల బాధితురాలు తీవ్ర అనారోగ్యానికి గురికాగా.. ఆమె స్నేహితులు ఆరా తీశారు. వారు ధైర్యం చెప్పడంతో ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించి నిందితులపై ఫిర్యాదు చేసింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం(ఏప్రిల్ 10) ఉదయం కాటాపూర్ క్రాస్ రోడ్డ వద్ద ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
Recommended Video
మరో ఘటనలో నిందితుడికి జీవిత ఖైదు...
మరో ఘటనలో... పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆంజనేయులు అనే నిందితుడికి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు రూ.20వేలు జరిమానా,జీవిత ఖైదు విధించింది. తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టిన ఆంజనేయులు.. 15 ఏళ్ల మైనర్ బాలికపై రెండేళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదవగా... తాజాగా సైబరాబాద్ మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది.