శ్మశానాల్లోనూ అడ్డగోలు దోపిడీ... డబుల్,ట్రిపుల్ ఛార్జీలు... రంగంలోకి జీహెచ్ఎంసీ,కీలక ఆదేశాలు...
కరోనా వేళ హైదరాబాద్లోని కొన్ని శ్మశాన వాటికల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ దృష్టికి వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. నగరంలోని అన్ని శ్మశానాల్లో ఒకే విధమైన ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ధరల పట్టికను సూచించేలా శ్మశానాల వద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. సాధారణ మృతుల అంత్యక్రియలకు రూ.6వేలు,కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.8వేలు వసూలు చేయాలని అందులో సూచించారు. జీహెచ్ఎంసీ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఆస్పత్రులు మొదలు శ్మశానాల వరకు...
కోవిడ్ను అడ్డం పెట్టుకుని కొన్ని కార్పోరేట్ ఆస్పత్రులు మొదలు శ్మశాన వాటికల వరకు అడ్డగోలు వసూళ్ల పర్వం నడుస్తోంది. ఆస్పత్రుల్లో లక్షలకు లక్షల ఫీజులు చెల్లించలేక కోవిడ్ పేషెంట్ల కుటుంబ సభ్యులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆఖరికి పేషెంట్ మరణిస్తే అంత్యక్రియలకు కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే అంబులెన్సు మొదలు అక్కడ అంత్యక్రియలకు భారీగా డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తోంది.
డబుల్,ట్రిపుల్ వసూళ్లు...
హైదరాబాద్లోని కొన్ని శ్మశానాల్లో కొంతమంది కాటికాపరులు రూ.12వేల నుంచి రూ.16వేలు వరకు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కొంతమంది సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. 'హైదరాబాద్లోని దాదాపు అన్ని శ్మశాన వాటికల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
ఫీడ్ ది నీడీ ఎన్జీవో తరుపున కోవిడ్ పేషెంట్ల అంత్యక్రియలకు మేము సాయం చేస్తున్నాం. కానీ ఈ అధిక ధరలు మా జేబుల్ని ఖాళీ చేస్తున్నాయి. ఇటీవల ఎల్బీనగర్లోని ఓ శ్మశానంలో ఏకంగా రూ.25వేలు అడిగారు. ప్రతీసారి డబుల్,ట్రిపుల్ ఛార్జీలు చెల్లించడం మావల్ల కావట్లేదు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి.' అని సాయితేజ అనే సోషల్ యాక్టివిస్ట్ రెండు రోజుల క్రితం వాపోయాడు.
Recommended Video
జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయవచ్చు...
పలువురు సామాజిక కార్యకర్తలు,ప్రజల నుంచి అందిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన అధికారులు ఈ వసూళ్ల పర్వానికి బ్రేక్ వేసేలా చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూళ్లు చేస్తే 040-2111 1111 కు కాల్ చేయాలని సూచించారు. ఒక్క హైదరాబాద్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
బిహార్,ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనైతే అంత్యక్రియలకు అయ్యే ఖర్చును భరించలేక కోవిడ్ పేషెంట్ల మృతదేహాలను గంగా నదిలో పారేస్తున్నారన్న ప్రచారం జరిగింది. నదిలో కుప్పలు తెప్పలుగా కొట్టుకొచ్చిన మృతదేహాలు దీనికి బలం చేకూర్చాయి. అసలే కుటుంబ సభ్యులు చనిపోయిన బాధలో ఉంటే ఇలా శ్మశానాల్లో అడ్డగోలుగా దోపిడీ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.