ఉద్యోగుల డీఏ పెంచిన తెలంగాణ సర్కార్, ప్రజలకు కేసీఆర్ ఆవిర్భావ శుభాకాంక్షలు
హైదరాబాద్ : మరికొన్ని గంటల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు .. రహదారులు .. ప్రగతి భవన్, రాజ్ భవన్ విద్యుత్ దీపాలంకరణతో జిగేల్ మంటున్నాయి. ఫార్మేషన్ డే రోజున విద్యుత్ మిరుగొట్లు కామనే .. కానీ ఈసారి ఉద్యోగులకు తీపికబురు అందించింది రాష్ట్రప్రభుత్వం. డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది.
పెరిగిన డీఏ ..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి పురస్కరించుకొని కరవు భత్యం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో డీఏ మొత్తం 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెరిగినట్టైంది. పెరిగిన డీఏ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులకు జూన్ నెల జీతంతోపాటు డీఏ అందుతుంది. బకాయిలను సాధారణ భవిష్యనిధి ఖాతాకు జమచేస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది.
మిగతా ఉద్యోగులకు కూడా ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల జీతాలను సీఎం కేసీఆర్ పెంచుతూ వస్తున్నారు. స్థానిక సంస్థల ప్రతనిధులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ టీచర్ల జీతాలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ట్రాఫిక్ కానిస్టేబుళ్ల 30 శాతం జీతం పెంచారు. వారు నిత్యం ట్రాఫిక్ లో ఉన్నందున .. వారికి జీతం పెంచినట్టు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇప్పడు తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నామని .. ఉత్సాహంతో ఆరో వసంతంలోకి అడుగుపెడుతున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. తొలి ఐదేళ్లలో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన, సరైన అడుగులు పడ్డాయని .. ప్రజలకు మెరుగైన సేవలు, పారదర్శకమైన పాలన చిత్తశుద్ధితో అందిస్తున్నామని కేసీఆర్ స్పష్టంచేశారు. భవిష్యత్లో నిర్దేశిత లక్ష్యాలను సాధించగలుగుతామని .. స్వరాష్ట్ర స్వప్నం సాకారం కావడంతో అమరులైన వీరుల ప్రాణత్యాగాలను సీఎం స్మరించుకున్నారు.