తెలంగాణకు విరాళంగా 16 కోట్ల పారాసిటమాల్ టాబ్లెట్లు ప్రకటించిన గ్రాన్యూల్స్ ఇండియా
హైదరాబాద్: కరోనా మహమ్మారితో పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ తనవంతుగా సాయం చేయడానికి ముందుకు వచ్చింది. 16 కోట్ల పారాసిటమాల్ మాత్రలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ను గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు బుధవారం కలిశారు.
రూ. 8 కోట్ల విలువైన పారాసిటమాల్ మాత్రలు విరాళంగా ఇస్తున్నట్లు ఈ సందర్భంగా గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. మే 12 నుంచి వారానికి కోటి మాత్రలు చొప్పున మొత్తంగా 16 కోట్ల మాత్రలు రాబోయే నాలుగు నెలల్లో ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాగా, కరోనా ప్రాథమిక చికిత్సలో పారాసిటమాల్ టాబ్లెట్లు కీలకంగా ఉన్న విషయం తెలిసిందే.

ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 4723 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,11,711కు చేరింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 745 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా, కరోనా బారినపడి 31 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 2834కు చేరింది. ఇప్పటి వరకూ 4,49,744 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications