పెళ్లికి రెండు గంటల ముందు వరుడు పరార్
నిజామాబాద్: మరికాసేపట్లో పెళ్లి అనగా వరుడు పారిపోయిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం పదకొండు గంటలకు ఆర్య నగర్లో పెళ్లి ఉంది. అయితే, అదనపు కట్నం డిమాండ్ చేస్తూ అంతలోనే వరుడు పరారయ్యాడు.
పారిపోయిన వ్యక్తి కోసం పెళ్లి కుమార్తె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం ఇవ్వలేదని అతను పరారయ్యాడని పెళ్లి కూతురు తరఫు వారు చెబుతున్నారు. పెళ్లికి రెండు గంటల ముందు ఇలా చేయడం ఏమిటని అంటున్నారు.
తాము పెళ్లి కోసం లక్ష రూపాయలు, మోటార్ బైక్ ఇచ్చామని, మరో రెండు లక్షలు అడుగుతున్నారన్నారు. తాము బైక్ పైన ఇస్తామని చెప్పకపోయినప్పటికీ.. అడగడంతో మూడు రోజుల క్రితం దానిని ఇచ్చామన్నారు. కాగా, పారిపోయిన వరుడి పేరు సాయి కుమార్.
మద్యం మత్తులో ఘర్షణ, వ్యక్తి దారుణ హత్య
మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిని పొడిచి చంపాడు. సూర్యాపేట భగత్సింగ్ నగర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. పూటుగా మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. గొడవ ముదరడంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి శ్రీనివాస్ అనే మరో వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.