బంధం: అమెరికాకు 5గురు ఎంపీల బృందం, టిఆర్ఎస్ ఎంపీ కవిత కూడా
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత వచ్చే వారం అమెరికా వెళ్లనున్నారు. ఐదుగురు పార్లమెంటు సభ్యులతో కూడిన బృందం వచ్చే వారం ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికా వెళ్లనుంది.
ఈ బృందంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీ కల్వకుంట్ల కవిత ఉన్నారు. ఐదుగురు సభ్యుల బృందం అమెరికాలో పర్యటించి... రెండు దేశాల మధ్య అభివృద్ధి, పారిశ్రామికవేత్తలు తదితరులతో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే దిశలో వీరి పర్యటన ఉండనుంది.
భారత్ - అమెరికో ఫోరం ఆఫ్ పార్లమెంటేరియన్స్ (ఐయూఎఫ్పీ) వైజయంత్ జే పాండా నేతృత్వంలో ఐదుగురు ఎంపీల బృందం వెల్లనుంది. ఇందులో జ్యోతిరాదిత్య సింధియా (కాంగ్రెస్), గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్), కల్వకుంట్ల కవిత (టిఆర్ఎస్), అర్పితా ఘోష్ (తృణమూల్ కాంగ్రెస్)లు ఉన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫిక్కీ)తో పాటు ఇండియా కాకస్, యూఎస్ కాంగ్రెస్కు చెందిన సెనేట్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్లు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఈ దిశగా చొరవ తీసుకున్నారు. ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఎస్ దీదర్ సింగ్, ఫిక్కీకే చెందిన హర్షవర్ధన్ నియోటియాలు కూడా వెళ్లనున్నారు.