వేధింపులు: హైదరాబాద్లో విజయవాడ టెక్కీ భార్య ఆత్మహత్య
ఇటీవలి కాలంలో కుటుంబ వేధింపుల కారణంగా టెక్కీలు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ టెక్కీ భార్య ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: ఇటీవలి కాలంలో కుటుంబ వేధింపుల కారణంగా టెక్కీలు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ టెక్కీ భార్య ఆత్మహత్య చేసుకుంది.భర్త వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు.
విజయవాడకు చెందిన అనుపమ (36) హైదరాబాదులోని నిజాంపేటలో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె విశాఖకు చెందిన బ్రహ్మాజీ గుప్తను 2009లో వివాహం చేసుకుంది. వారికి సిద్ధార్త (12), సార్వనిక (8) ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తరుచూ గొడవలు
వారు నిజాంపేట గ్రామంలోని ఓ ఫ్లాట్లో నివసిస్తున్నారు. బ్రహ్మాజీ ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తున్నారు. అనుపమ హౌస్ వైఫ్. గత కొద్ది నెలలుగా భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారు.
ఉరేసుకొని..
సోమవారం రోజు బ్రహ్మాజీ ఆఫీస్కు వెళ్లే ముందు భార్యతో గొడవ పడ్డాడు. మధ్యాహ్నం అతను తన భార్య మొబైల్కు కాల్ చేశాడు. కానీ ఎలాంటి స్పందన లేదు. వెంటనే అతను వాచ్మన్కు ఫోన్ చేశాడు. వాచ్మెన్ ఫ్లాట్కు వెళ్లి చూసేసరికి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించింది.
బెజవాడ నుంచి తల్లిదండ్రులు
వెంటనే వాచ్మెన్ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. అనుపమ తల్లిదండ్రులు విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
విచారణ నిమిత్తం అదుపులో భర్త
మృతురాలి తండ్రి నాగభూషణం మాట్లాడుతూ.. బ్రహ్మాజీ తన కూతురును వేధించేవాడని, కొట్టేవాడని ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తపై కేసు నమోదు చేశారు. పోలీసులు అతనిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరి పిల్లలు ఎండాకాలం సెలవుల నిమిత్తం తాత గారి ఇంట్లో ఉన్నారు.