బాబు నిజస్వరూపం ఇదే: హరీశ్, కెసిఆర్వి పచ్చి అబద్ధాలన్న గుత్తా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించ తలపెట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై కృష్ణా బోర్డుకు ఏపి ప్రభుత్వం ఫిర్యాదు చేయడం దారుణమన్నారు.
హైదరాబాద్లో బుధవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజస్వరూపం మరోసారి బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతులకు సాగు నీళ్లిచ్చేందుకు చేపట్టే పథకాన్ని సైతం చంద్రబాబు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై తెలంగాణ టిడిపి నేతలు స్పందించాలని మంత్రి హరీష్ ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఆంధ్రా పెత్తనం సాగదని హరీశ్ రావు అన్నారు. విజయవాడ కేంద్రంగా నడిచే పార్టీలకు ప్రజలకు బుద్ధి చెప్తారన్నారు. ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై నోరుపారేసుకుంటే పడే పదిఓట్లు కూడా పడవని మంత్రి హరీష్రావు అన్నారు.
‘కాంగ్రెస్కు డిపాజిట్ దక్కదనే భయం పట్టుకుంది. నోరు పారేసుకుంటే పడే పది ఓట్లు కూడా రావు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అంటే ఉత్తమ్కుమార్రెడ్డి నోరు మెదపలేదు. మీ చరిత్ర వరంగల్ జిల్లా ప్రజలు మర్చిపోలేదు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ వరంగల్కు ఒక్క మంచి పనైనా చేసిందా' అని హరీశ్ ప్రశ్నించారు.
సంక్షేమం కోసం దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెడుతున్నామని, 16 నెలల పాలనలో ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెనట్లు తెలిపారు. వరంగల్కు హెల్త్ యూనివర్సిటీని ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు.
టిఆర్ఎస్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. చివరి వరకు తెలంగాణను అడ్డుకున్న పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, ఆంధ్రా పార్టీలైన టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు ఆదరించరని మంత్రి పేర్కొన్నారు.
కేసీఆర్ ఎందుకు మాట తప్పారో చెప్పాలి: గుత్తా
నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం నల్గొండలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని ఆరోపించారు.
మాట తప్పితే తల నరుక్కుంటానని చెబుతున్న కెసిఆర్... దళిత సీఎం, మూడెకరాల భూమి, 12 శాతం రిజర్వేషన్ల విషయంలో ఎందుకు మాట తప్పారో చెప్పాలని గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
టిఆర్ఎస్కు వ్యతిరేకంగా పెయిడ్ ఆర్టికల్స్
వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి, టిడిపిలకు అనుకూలంగా పెయిడ్ ఆర్టికల్స్ను ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాములు నాయక్, పొలిట్బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మంగళవారం సెక్రటేరియట్లో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ దేవసేనకు ఫిర్యాదు చేశారు.
నవంబర్ 16న టిడిపి ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఓటర్లను ప్రభావితం చేసేలా సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని, అక్టోబర్ 31న కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క టిఆర్ఎస్ పార్టీ మీద, సీఎం కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.