జైరాంపై హరీశ్ వ్యాఖ్యలు: కాంగ్రెస్ వాకౌట్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్, అధికార పక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ వల్లే ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జైరాం రమేష్ తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు.
ముంపు మండలాలను ఏపిలో కలిపిందే కాంగ్రెస్సేనని ఆరోపించారు. ఆ ఏడు ముంపు మండలాలను కాంగ్రెస్ అనాథగా మార్చిందని అన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలపడం, లోయర్ సీలేరు ప్రాజెక్టును ఏపీకి కేటాయించడాన్ని రాజ్యసభలో సంఖ్యాబలం ఉండికూడా కాంగ్రెస్ అడ్డుకోలేదని మంత్రి హరీష్రావు అన్నారు.
ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా లోయర్ సీలేరు ప్రాజెక్టు, ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో కలపడంపై కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్కుమార్ ప్రశ్నపై సభలో చర్చ సందర్భంగా మంత్రి హరీష్రావు స్పందిస్తూ... కాంగ్రెస్ వల్లే లోయర్ సీలేరు ప్రాజెక్టు ఏపీకి వెళ్లిందని అన్నారు. బిజెపి బిల్లు పెడితే కాంగ్రెస్ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఏడు మండలాల ప్రజల అన్యాయానికి కారణం కాంగ్రెస్సేనని అన్నారు. జైరాం రమేష్ వల్లే ఈ ప్రాజెక్టు ఏపీకి చేరింది. లోయర్ సీలేరు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తెలిపారు.
కాంగ్రెస్ వాకౌట్
కాగా, హరీశ్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసింది. అంతకుముందు కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వమే 7 మండలాలను ఏపిలో కలిపిందని అన్నారు. 7మండలాలు పోయినా తెలంగాణ వచ్చిందని సిఎం కెసిఆర్ ఇంతకుముందు అన్నారని చిన్నారెడ్డి చెప్పారు.
ఏడు మండలాలను ఏపిలో కలుపుతూ చేసిన బిల్లును తమ పార్టీ సభ్యుడు కేశవరావు అడ్డుకున్నారని హరీశ్ రావు అన్నారు. ఏడు మండలాలపై కెసిఆర్ను నిందించించడం సిగ్గుచేటని అన్నారు. 7మండలాలను ఏపికి ఇవ్వడాన్ని నిరసిస్తూ కెసిఆర్ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారని, ఆ బంద్కు కూడా కాంగ్రెస్ ద్దతు తెలపలేదని అన్నారు. ప్రస్తుతం ఏపిలో ఉన్న 7 మండలాలకు తెలంగాణ ప్రభుత్వమే కరెంటు ఇస్తోందని అన్నారు.
హరీశ్ రావు గొప్ప మేధావని తమకు తెలుసని, అయితే తమ సభ్యుడు అజయ్కి అవగాహన లేదనడం సరికాదని చిన్నారెడ్డి అన్నారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. 7 మండలాలను తిరిగి తెలంగాణకు వచ్చేలా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
ఇది ఇలా ఉండగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వల్లే 7 మండలాలు ఏపికి వెళ్లాయనడం సరికాదని బిజెపి సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ సభ్యుల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయని అన్నారు. జైరాం రమేష్ తాము చేసిన బిల్లును తూచ తప్పకుండా అమలు చేశామని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వల్లే ఏడు మండలాలు ఏపికి వెళ్లాయని ఆరోపించారు.
హరీశ్-అజయ్ల మధ్య తీవ్ర వాగ్వాదం
సభ 10 నిమిషాలు వాయిదా పడిన అనంతరం మాజీ మంత్రి జానారెడ్డి ఛాంబర్ ముందు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. సభలో ఘటనపై అజయ్ని హరీశ్ రావు సున్నితంగా హెచ్చరించారు. తన వ్యాఖ్యల ఉపసంహరణ డిమాండ్ వదిలేయాలని హరీశ్ రావు సూచించారు. లేదంటే ఇబ్బందుల్లో పడతావని అజయ్ని హెచ్చరించారు.
కాగా, హరీశ్ వ్యాఖ్యలకు స్పందించిన అజయ్ మాట్లాడుతూ.. తాను తప్పు చేయలేదని, ఏం చేసుకుంటావో చేస్కో అని అన్నారు. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. కొత్తవారు, అవగాహన లేదని తమను అవమానపరుస్తున్నారని ఆరోపించారు.