బాబు కన్నా కెసిఆరే సీనియర్: ఏకేసిన హరీశ్రావు
మెదక్: ఏపి సిఎం చంద్రబాబుకు వయసు మీద పడి మతితప్పిందని, అందుకే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ హరీశ్రావు ధ్వజమెత్తారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే బాబు, ఇపుడు పూర్తిగా మరుగుజ్జులా మారిపోయాడని, పక్కనవాళ్లు పచ్చగా ఉంటే ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడని అన్నారు.
శుక్రవారం మెదక్ జిల్లా సంగారెడ్డి, నిజమాబాద్ జిల్లా కామారెడ్డిలో జరిగిన మీడియా సమావేశాల్లో హరీశ్రావు మాట్లాడారు. ‘పొరుగున ఉన్న రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు హైదరాబాద్లోనే తిష్ట వేశారు. తెలంగాణ ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడమే పనిగా పెట్టుకొన్నారు' అని అన్నారు.
తెలుగుదేశం పార్టీలో కేసీఆరే సీనియర్ అని, చంద్రబాబు జూనియర్ అని గుర్తుచేశారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని, అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడి పోయాడని హరీశ్ చెప్పారు. ఆ తర్వాత రాజకీయంగా పుట్టగతులులేక మామ పెట్టిన పార్టీలో దిక్కులేక చేరారని తెలిపారు. కేసీఆర్ 1982 లోనే టీడీపీలో చేరితే చంద్రబాబు ఏడాది తరువాత 1983లో టీడీపీలో చేరారని అన్నారు. టీడీపీలో కేసీఆరే సీనియర్ అని స్పష్టం చేశారు.
మేడే ఉత్సవాల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడిన తీరుని మంత్రి గర్హించారు. ‘టీడీపీయే లేకుంటే సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా సిద్దిపేటలో మేకలు మేపుకొని బతికేవారని చంద్రబాబు అన్నారు. గొర్రెలు కాసుకోవడం నీచమా..అవమానకరమా..? అని చంద్రబాబును ఆయన నిలదీశారు. బాబు వ్యాఖ్యలు తెలంగాణలోని వేలాది కుటుంబాల గొర్రెల కాపరుల వృత్తిని అవమానపర్చాయని హరీశ్ మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ఉన్నత కుటుంబంలో పుట్టి, బంగ్లాలో పెరిగారని.. ఆ బంగ్లాను ప్రభుత్వ పాఠశాలకు ఆయన ధారాదత్తం చేశారని వివరించారు. చంద్రబాబు మాత్రం పదేళ్లు అధికారంలో ఉండి అవినీతి పనులు చేసి వేలాది కోట్లు వెనుకేసుకొన్నారని విమర్శించారు. ఏపి సీఎం అయ్యాక హైదరాబాద్లో ఉండనని, ఆంధ్రా ప్రాంతంలోనే ఉంటానని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నాడన్నారు.
‘ఆయన పాలనపై ప్రజ లు తిరగబడుతున్నారు. అది ఆయనకు మింగుడుపడట్లేదు. అందుకే తెలంగాణలో ప్రజలు, ప్రభుత్వం మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నా' చంద్రబాబుపై మండిపడ్డారు.