హైకోర్టు తీర్పుపై కేసీఆర్ హర్షం: ‘ఔట్ సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులకు పండగ రోజు’
హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్కు హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్(ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు) సర్వీసును క్రమబద్దీకరించడాన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో విద్యుత్ శాఖలోని జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలలో పనిచేసే 23వేల మంది ఆర్టిజన్లను క్రమబద్దీకరించడానికి మార్గం సుగమమైంది.
విద్యుత్ ఉద్యోగులపై కేసీఆర్ వరాల వర్షం: 'చంద్రబాబు దుకాణమా?' అంటూ సెటైర్లు
విద్యుత్ సంస్థలలో ఎంతో కాలంగా పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ గతంలోనే విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు 23వేల మంది ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరిస్తూ గత ఏడాది నాలుగు విద్యుత్ సంస్థలు ఆదేశాలు జారిచేశాయి.
కాగా, ఆర్టిజన్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టిజన్ల క్రమబద్దీకరణ అంశంపై మంగళవారం విచారణ కొనసాగింది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని విద్యుత్ శాఖ తరపున వాదించే లాయర్లు హైకోర్టుకు వివరించారు. దీంతో హైకోర్టు సదరు పిటిషన్ను కొట్టేసింది.
కేసీఆర్ హర్షం
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సేవలను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్జిజన్లను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం ఎంతో మానవీయతతో నిర్ణయం తీసుకున్నదని, దాన్ని హైకోర్టు సమర్థించడం ఆనందకరమని అపద్ధర్మ సీఎం చెప్పారు. 23 వేల మంది ఆర్టిజన్లకు ఇంది పండుగ రోజని ముఖ్యమంత్రి అభివర్ణించారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావుతో సిఎం మాట్లాడారు. సమర్థంగా వాదనలు వినిపించి ఆర్టిజన్ల జీవితాల్లో వెలుగులు నింపారని అభినందించారు. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేల్ నిర్ణయించాలని, వారికి పి.ఆర్.సి.అమలు చేయాలని సిఎండిని ముఖ్యమంత్రి ఆదేశించారు.