భోలక్పూర్, రామాంతపూర్ను మింగేసిన భారీ వర్షం: మృతులు వీరే (ఫోటోలు)
హైదరాబాద్: బుధవారం నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఏడుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఉదయం తెల్లవారుతుండగానే మబ్బుకు చిల్లు పడిందా అనే విధంగా కురిసిన వర్షం భోలక్పూర్లో ముగ్గురిని బలితీసుకోగా, రామాంతపూర్లో ఇద్దురు పిల్లలతో సహా నలుగురిని బలి తీసుకుంది.
భోలక్పూర్లో పురాతన రేకుల ఇల్లు కూలి హాహాకారాలు చేసిన తల్లీకూతుళ్లను కాపాడేందుకు యత్నించిన స్థానికులకు కరెంటు తీగలు యమపాశాల వలే అడ్డు తగిలాయి. అలాగే రామంతాపూర్లోని ఓ వాణిజ్య భవనం ప్రహరీ కూలీ గుడిసెపై పిడుగులా కూలింది. ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం కుటుంబాన్ని మృత్యువు కబళించింది.

భోలక్పూర్లో ముగ్గురు మృతి
బుధవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి భోలక్పూర్లో ఓ ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులతో సహా తల్లి మృతి చెందింది. భోలక్పూర్లోని బంగ్లాదేశ్ వద్ద నదీం జానీ, బిల్కిస్ ఫాతిమా(25) ఇద్దరు దంపతులు తమ ఇద్దరు కూతుళ్లు జెబాఫాతిమా(5), మరియా ఫాతిమా(2) కలిసి నివసిస్తున్నారు. బుధవారం తొమ్మదిన్నర గంటల సమయంలో వర్షం కారణంగా వారి ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో జెబా ఫాతిమా, మరియా ఫాతిమా అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన బిల్కిస్ ఫాతిమాను భర్త నదీమ్ జానీతోపాటు స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది.

పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేత
దీంతో ముగ్గురు మృతదేహాలకు గాంధీ మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. రాత్రి 7.30 గంటలకు ముగ్గురి మృతహాలను ముస్లిం పెద్దలు మజీద్కు తీసుకెళ్లి ప్రార్ధనలు చేసి అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు భోలక్పూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చిక్కడపల్లి ఏసీపీ జోగుల నర్సయ్య, ముషీరాబాద్ సీఐ బిట్టు మోహన్ కుమార్ ఆధ్యర్యంలో ముషీరాబాద్ ఎస్సైలు సాయికుమార్, రామరాజు, రామన్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ జానయ్య బృందం బందోబస్తులో పాల్గొన్నారు.

కరెంట్ షాక్ రాకుంటే బతికించుకునే వాడిని..
ఉదయం 8.30 గంటలు కావస్తుంది. అందరం ఇంట్లోనే ఉన్నాం. ముందుగా ఇంట్లో గోడ పక్కన మట్టి రాలుతోంది. బయటకి వెళ్లి చూసే సరికి ఇంట్లో గోడ బీరువాపై పడింది. మంచంపై ఉన్న మా భార్య, బిల్కిస్ ఫాతిమా, మా కూతుర్లు జెబా ఫాతిమా(పెద్దమ్మాయి), మరియా ఫాతిమా(చిన్నమ్మాయి) ఇద్దరు బీరువా కింద ఉన్నారు. నా పెద్ద కూతురు డాడీ బచావో.. అంటూ అరుపులు చేసింది.. నేను ఇంట్లోకెళ్తామని ప్రయత్నించగా కరెంట్ షాక్ వచ్చింది. అరగంట సేపు ప్రయత్నం చేశాను. కానీ ఫలితం దక్కలేదు. అప్పటికే వారి అరుపులు బందయ్యాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అంతా అయిపోయింది. అంటూ మృతుల కుటుంబ యజమాని నదీమ్ జానీ రోదిస్తూ చెప్పాడు.

గాంధీ మార్చురీ వద్ద మంత్రుల పరామర్శ
రామంతాపూర్, భోలక్పూర్ ఘటనలో చనిపోయిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో మృతుల కుటుంబాలను కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, మేయర్ బొంతురామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్దన్రెడ్డి మార్చురీ వద్దకు చేరుకుని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, నిర్మాణం చేపడుతున్న బిల్డర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మృతుల కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా: ఆర్డీఓ రఘురాం శర్మ
భోలక్పూర్లో ఇల్లు కూలి మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 లక్షలు కేటాయిస్తున్నట్లు సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురాం శర్మ తెలిపారు. తక్షణ సౌకర్యార్ధం ఘటనా స్ధలానికి వచ్చిన బంధువులకు భోజన సౌకర్యం, ఇతర ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇద్దరి చిన్నారులకు ప్రభుత్వ పరిశీలించిన తర్వాత అర్హులైతే ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు.

ఘటనా స్థలాన్ని సందర్శించిన ప్రముఖులు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె లక్ష్మణ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, జీఎచ్ఎంసీ జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురాం శర్మ, ముషీరాబాద్ ఎమ్మార్వో రాములు, డీఎంసీ ముకుందరెడ్డి, టౌన్ప్లానింగ్ ఏసీపీ జగన్మోహన్ రావు, భోలక్పూర్, రాంనగర్ కార్పొరేటర్లు అఖిల్ అహ్మద్, వి. శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ తదితరులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు












Click it and Unblock the Notifications