ముందు అవగాహన కల్పించండి, తర్వాతే హెల్మెట్ రూల్: హైకోర్టు
హైదరాబాద్: ద్విచక్రవాహనంతో పాటు హెల్మెట్ కొనుగోలు చేయాలన్న తెలంగాణ రవాణాశాఖ నిబంధనపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ద్విచక్రవాహనంతో పాటు హెల్మెట్ కొనుగోలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
అయితే హెల్మెట్ వాడకం జరిగేలా చూడాలని న్యాయస్థానం సూచించింది. హెల్మెట్ లేని వాహనదారులపై 92,164 కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు 92,164 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
వాహనదారులకు 15 రోజులపాటు హెల్మెట్ వినియోగంపై చైతన్యం కల్పించాలని, ఆ తర్వాత హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం రెండు వారాలపాటు వాయిదా వేసింది.
9న తెలంగాణ భాషాదినోత్సవం జీవో జారీ
సెప్టెంబర్ 9న తెలంగాణ భాషాదినోత్సవం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించనున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
జిల్లా కేంద్రాల్లో కాళోజీ చిత్ర ప్రదర్శన నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ భాషలో నవలలు, నాటకాలు, కవిత్వంపై పోటీల నిర్వహణ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో కాళోజీ జీవితం, కవిత్వంపై చర్చ జరగనుంది.