ఆర్టీసీ సమ్మె కేసులో కొత్త ట్విస్ట్: హైకోర్టులో ముగిసిన విచారణ: లేబర్ కోర్టుకి చేరిన పంచాయితీ..!
తెలంగాణ ఆర్టీసీ సమ్మె అంశంలో హైకోర్టులో విచారణ పూర్తయింది. కానీ, కోర్టు దీనిని కార్మిక శాఖ కమిషనర్ వద్ద తేల్చుకోవాలని సూచించింది. అందుకోసం దీని పైన చర్చలు జరిపి..సమస్య పరిష్కరించాలని ఇందు కోసం రెండు వారాల గడువు కేటాయిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సమ్మె చట్టవిరుద్దమని ప్రభుత్వం చేసిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు.
అదే విధంగా.. చర్చలు జరపమని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక, ఇప్పుడు ఈ వ్యవహారం కార్మిక శాఖ కమిషనర్ వద్దకు చేరింది. ఇప్పటికే సమ్మె ప్రారంభమై 45 రోజులు అవుతోంది. పరిష్కారం మాత్రం లభించలేదు. మరో రెండు వారాల వరకు పరిష్కారం లభించే అవకాశాలు కనిపించటం లేదు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది. కార్మిక జేఏసీ నేతలు ఏం చేయబోతున్నారు.
హైకోర్టులో ముగిసిన విచారణ..చివరకు
తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగాయి. అనేక సార్లు విచారణలు జరిగాయి. ఆర్టీసీ జేఏసీ..ఆర్టీసీ..తెలంగాణ ప్రభుత్వం..కేంద్ర ప్రభుత్వం సైతం కోర్టు ముందు తమ వాదన లను వినిపించాయి. ఇప్పుడు కోర్టులో విచారణ ముగిసింది. అయినా తుది పరిష్కారం మాత్రం లభించలేదు. తుది విచారణ సమయంలో కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం కోరుతున్నట్లుగా సమ్మె ను చట్ట విరుద్దమని ప్రకటించలేమని స్పష్టం చేసింది. అదే విధంగా..జేఏసీ కోరుతున్నట్లుగా ప్రభుత్వాన్ని చర్చలకు పిలవాలని ఆదేశించలేం. కోర్టుకు పరిధులు ఉంటాయి. వాటిని దాటి ముందుకు వెళ్లలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక, ఈ కేసు పైన హైకోర్టులో విచారణ పూర్తి కావటంతో ఈ వ్యవహారం అక్కడి నుండి కార్మిక శాఖ వద్దకు చేరింది.
రెండు వారాల్లో కార్మిక శాఖ పరిష్కరించాలి
హైకోర్టులో విచారణ సమయంలో ప్రభుత్వ తరపు వాదనల్లో..ఈ మొత్తం వ్యవహారం కార్మిక శాఖ పరిధిలోకి వస్తుందని..అక్కడ చర్చించాల్సిన అంశాలంటూ వాదించింది. ఇప్పటి వరకు అనేక సార్లు విచారించిన హైకోర్టు దీని పరిష్కారం కోసం ముగ్గురు రిటైర్డ్ సుప్రీం న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని ప్రతిపాదించినా..అందుకు ప్రభుత్వం అనుమతించలేదు.
ఇక, ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అటు ప్రభుత్వం..ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించి రెండు వారాల్లోగా పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్ ను ఆదేశించింది. కార్మిక కమిషనర్ వద్ద రెండు పక్షాల వాదనలు విన్న తరువాత అక్కడ లేబర్ ట్రిబ్యూనల్ కు వెళ్లాలా వద్దా అనేది అక్కడ నిర్ణయిస్తారని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో..ఈ సమస్య మీద మరో రెండు వారాల పాటు ఎవరి వాదనలు వారు వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాతనే దీని పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..
హైకోర్టులో వాదనల సమయంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఆర్టీసీ తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్ ఓ రాజకీయ పార్టీ నేత ఇచ్చిన అఫిడవిట్లా వుందని, పీఎఫ్ డబ్బులను అక్రమంగా వాడుకొని, కార్మికులను విధుల్లోకి తీసుకోమని ఎండీ ఎలా చెబుతారని ఆయన మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని, కమిటీ వేస్తే సమ్మెపై పునరాలోచిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఓ రహస్య ఎజెండా వుందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
కార్మికులందర్నీ విధుల్లోకి తీసుకోవాలని, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే, ఆ తరువాత కోర్టు సైతం తమ పరిమితికి లోబడి తాము పని చేయాల్సి ఉంటుందని వివరిస్తూ.. కేసును కార్మిక శాఖకు రిఫర్ చేసింది. నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. ఇప్పుడు దీని పైన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.