వృథా ఖర్చు ఎందుకంది? అంతే.. భార్యను కొట్టి చంపేశాడు.. ఆపై నాటకం ఆడాడు
వృథాగా ఖర్చు చేయొద్దు అని హితవు పలికిన పాపానికి భర్త చేతిలో బలైపోయిందా భార్య. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని యడవల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఈ దారుణం చోటు చేసుకుంది.
రాచర్ల: కష్టపడి సంపాదించిన డబ్బు.. వృథాగా ఖర్చు చేయొద్దు అని హితవు పలికిన పాపానికి భర్త చేతిలో బలైపోయిందా భార్య. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని యడవల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఈ దారుణం చోటు చేసుకుంది. ఆవేశంలో ఆమెను చంపేసిన తరువాత అతడు ఆలోచించాడు.. తెలివిగా తన భార్య విద్యుదాఘాతానికి బలైపోయిందంటూ నాటకమాడాడు. ఇంత చేసినా చివరికి కటకటాలు లెక్కపెట్టక తప్పలేదు.
గిద్దలూరు పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని ఆకవీడు గ్రామానికి చెందిన ఎలిజబెత్రాణి(28)ని, యడవల్లికి చెందిన సైనికుడు బైళ్ల సాల్మన్ అలియాస్ చెన్నయ్యకు ఇచ్చి పదకొండేళ్ల క్రితం వివాహం జరిపించారు. సాల్మన్ జమ్ములోని ఆర్మీ- నాగియా ట్రాన్సిక్షన్ విభాగంలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. వీరు హైదరాబాదు తిరుమలగిరి క్వార్టర్లలో నివాసం ఉంటున్నారు.

సాల్మన్ తన తండ్రి సంవత్సరీకం నిర్వహించడానికి వారం రోజుల క్రితం సెలవు పెట్టాడు. భార్య, కుమార్తెతో కలిసి ఇక్కడికి వచ్చాడు. తండ్రి జ్ఞాపకార్థం ఈనెల 2న గ్రామంలో సేద్యపు కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించాడు. అయితే సంపాదించిన డబ్బులు ఇలా వృథాగా ఖర్చు చేయవద్దంటూ భార్య ఎలిజబెత్రాణి బుధవారం రాత్రి భర్తతో గొడవపడింది.
ఈ గొడవలో కోపోద్రిక్తుడైన సాల్మన్ రాడ్తో భార్య తలపై కొట్టడంతో ఎలిజబెత్రాణి కిందపడిపోయింది. అప్పటికీ కోపం చల్లారక సాల్మన్ ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించగా శరీరం పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. అయితే తన భార్య బుధవారం రాత్రి భార్య విద్యుదాఘాతంతో మృతి చెందిందని సాల్మన్ గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేశాడు.
సమాచారం అందుకున్న డీఎస్సీ షేక్ మాసూమ్ బాషా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు తెలుసుకున్నారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు గిద్దలూరు సీఐ వి.శ్రీరాం, ఎస్ఐ కె.మల్లికార్జున గ్రామస్థులను విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి శవపరీక్ష నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు సాల్మన్ ను గిద్దలూరు పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications