పంపానది ఘాట్ రోడ్డులో హైదరాబాద్ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా!
ఎంతో నియమ నిష్టలతో అయ్యప్పను పూజించి, స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట ఉప్పర్ గూడాకి చెందిన అయ్యప్ప స్వాముల బస్సు పంపా నదికి 15కిలోమీటర్ల దూరం లోని ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 8మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదం
ఎరుమెలి నుండి పంపా నది మీదుగా శబరిమలకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. గురుస్వామి రాంపాల్ యాదవ్, అభి యాదవ్, రామ్ యాదవ్, పెద్ది యాదవ్ ల ఆధ్వర్యంలో శబరిమల స్వామి దర్శనానికి వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు పంపానదికి 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్ రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తా పడింది. అయితే బస్సు మూడు చెట్లపై ఒరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

వాహన డ్రైవర్ మృతి, 8మందికి తీవ్ర గాయాలు
ఘటనతో ఒక్కసారిగా అయ్యప్ప స్వాములు ఏం జరుగుతుందో కూడా అర్ధం కాని స్థితిలో ఆందోళన చెందారు. తీవ్రగాయాలు పాలైన డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఉన్న 22 మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ లోని కుటుంబసభ్యుల ఆందోళన
హైదరాబాద్ పాతబస్తీ మాదన్న పేట ఉప్పర్ గూడా కు చెందిన అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడటంతో హైదరాబాద్ లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ రాజు మరణించాడు. హైదరాబాద్ సైదాబాద్ ఏకలవ్య నగర్ కు చెందిన వాడిగా గుర్తించారు..మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో ఉంచారు.
వాహనం అదుపు తప్పి బోల్తా పడినట్టు గుర్తింపు
వాహనం వక్రమార్గం కిందకు దిగుతుండగా అదుపు తప్పి వాహనం బోల్తా పడినట్టు పోలీస్ అధికారులు చెప్తున్నారు. వాహన ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. అయితే బస్సు చెట్ల మీద పడటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రాణాలు పోవాల్సిన చోట అయ్యప్ప స్వామినే కాపాడారని ప్రమాదం నుండి బయటపడిన భక్తులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications