హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డా మారుతోంది, చర్యలు ఏవి?: లక్ష్మణ్ ఆందోళన
హైదరాబాద్: గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు రహస్య స్థావరంగా మారుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ దాడులు జరిగినా హైదరాబాద్లోనే మూలాలు ఉంటున్నాయని చెప్పారు.
ఇదే నిదర్శనం
హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ సోమవారం జరిపిన దాడుల్లో పెద్దఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. పాతబస్తీలో మజ్లిస్ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో చొరబాటు దారులు యథేచ్ఛగా నివసిస్తున్నారని లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
అందుకే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నప్పటికీ మజ్లిస్తో రాజకీయ స్నేహం కారణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. పట్టుబడిన వారిని కూడా కేవలం మందలించి వదిలిపెట్టడం ప్రభుత్వ అలసత్వానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.
ఈ ప్రాంతాల్లోనూ ఉగ్ర కదలికలు
కట్టడి చేయాల్సిన పాలకులే మద్దతు దారులతో చేతులు కలపడం సరికాదని ధ్వజమెత్తారు. హైదరాబాద్తో పాటు నల్గొండ, నిజామాబాద్ లోనూ గతంలో ఉగ్రవాద కదలికలు కనిపించాయని లక్ష్మణ్ గుర్తుచేశారు. ప్రభుత్వం ఇకనైనా మెతక వైఖరి వీడి అసోం తరహాలో కట్టడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అక్రమచొరబాటుదారుల జాబితా రూపొందించాలి
హైదరాబాద్లో కూడా ప్రభుత్వం ఎన్ఆర్సీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అక్రమ చొరబాటు దారుల లిస్టును ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. చారిత్రక ఓబీసీ కమిషన్కు బీజేపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే బీసీల్లో వర్గీకరణ చేపడుతున్నామని వెల్లడించారు. ఆగస్టు 23న గద్వాల్లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని, సెప్టెంబర్లో రెండో దశ బస్సు యాత్ర ఉంటుందని చెప్పారు.