ఓ వర్గాన్ని కించపరిచేలా కార్టూన్: హైదరాబాద్లో జర్నలిస్ట్ స్వాతిపై కేసు
హైదరాబాద్: తన ఫేస్బుక్ ఖాతాలో ఓ వర్గం మనోభావాలను దారుణంగా కించపరుస్తూ కార్టూన్ వేశారనే ఆరోపణలపై ప్రముఖ పాత్రికేయురాలు స్వాతి వడ్లమూడిపై హైదరాబాదులోని సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో గీసిన కార్డున్ తమ వర్గం మనోభావాలు కించపరిచిందంటూ హిందూ సంఘటన్ అధ్యక్షులు కరుణాసాగర్ ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 10న ఆమె ఈ కార్టూన్ను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.

కథువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో ఆమె ఈ కార్టూన్ వేశారు. దీనిపై కరుణాసాగర్ మాట్లాడుతూ.. కథువా, ఉన్నావ్ ఘటనలపై ఆవేదనలో తప్పు లేదని, ఆమెకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందని, కానీ ఇందులోకి హిందూ దేవుళ్లను తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. కార్టూన్ పేరుతో కోట్లాది రామ భక్తులను ఆమె అవమానించారన్నారు.
దీనిపై స్వాతి వడ్లమూడి మాట్లాడుతూ.. కార్టూన్కు వేల సంఖ్యలో లైకులు వచ్చాయని, తనకు వ్యతిరేకంగా కూడా కామెంట్లు వచ్చాయని, తనకు ఫిర్యాదు నోటీసు రాలేదని చెప్పారు. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని పోలీసులు తెలిపారు. త్వరలో ఆమెకు నోటీసులు పంపనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications