హైదరాబాద్ మెట్రో రైలు రాజకీయం: ఘనత ఎవరిది?
హైదరాబాద్: ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు కార్యరూపం ధరించింది. అయితే, ఆ ఘనతను సొంతం చేసుకునే విషయంలో రాజకీయం నడుస్తోంది. ఆ ఘనత తమదంటే తమదని రాజకీయ పార్టీలు చెప్పుకుంటున్నాయి.
Recommended Video
ఆ ఘతన తనదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటుండగా, అది తమ పార్టీ ఘనతేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అంటున్నారు. వాటిని పట్టించుకోకుండా హైదరాబాద్ నగరవాసులు మాత్రం మెట్రోలో జాలీగా ప్రయాణం చేస్తున్నారు.
చంద్రబాబు ఏమన్నారు..
హైదరాబాద్ అభివృద్ధిలో తమ ముద్ర పోయేది కాదని, మెట్రోతోపాటు జీఈఎస్ జరుగుతున్న హెచ్ఐసిసి వేదిక, శంషాబాద్ ఎయిర్పోర్టు, సైబరాబాద్ ఇవన్నీ తమ తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చినవేనని చంద్రబాబు అన్నారు. మెట్రోరైల్ను తాను ప్రారంభించినా, ప్రారంభించకున్నా హైదరాబాద్ను అభివృద్ధి చేశామనే సంతృప్తి ఉందని ఆయన అన్నారు.
నేనే పోరాడానని చంద్రబాబు
మెట్రోరైల్ కోసం వాజపేయి హయాంలో తానే పోరాడానని చంద్రబాబు మీడియా ప్రతినిధుల వద్ద గుర్తు చేశారు. బెంగళూరు, గుజరాత్ ప్రభుత్వాలు మెట్రోను వేగంగా పూర్తి చేశాయని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఢిల్లీ మెట్రో శ్రీధరన్తో హైదరాబాద్ మెట్రోపై అధ్యయనం చేయించాచనని ఆయన అన్నారు.
వైఎస్పై చంద్రబాబు నిందలు...
తన తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి మెట్రోను ఆలస్యం చేశారని చంద్రబాబు అన్నారు. అందుకే ఇంతకాలం పట్టిందని వ్యాఖ్యానించారు. తాను ఆ ప్రారంభోత్సవానికి వెళ్లినా వెళ్లకున్నా హైదరాబాద్పై మేం వేసిన ముద్ర చెరిగేది కాదని అన్నారు.
ఘనత మాదేనన్న రఘువీరా..
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. మెట్రో ప్రాజెక్టు ఘనత తమదేనంటూ చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రపంచంలో ఏ మంచి జరిగినా తానే చేశానని, చెడు జరిగితే ప్రతిపక్షాలకు అపాదించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వదిలి వచ్చినా చంద్రబాబుకు హైదరాబాద్పై మమకారం పోలేదని ఎద్దేవా చేశారు. మెట్రో రూపొందించి పనులు ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. మెట్రో కోసం దివంగత నేతలతోపాటు మాజీ సీఎంలు వైస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్ల కృషి ఎంతో ఉందని అన్నారు.
కెసిఆర్ మాత్రం కొట్టేశారు...
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు చంద్రబాబు, కాంగ్రెసు ముఖ్యమంత్రుల ప్రయత్నాలను పక్కన పెడితే ఆ ఘనత మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కొట్టేశారు. చెప్పినట్లుగానే ప్రధాని నరేంద్ర మోడీతో దాన్ని ప్రారంభింపజేసి, మెట్రో రైల్లో ప్రయాణించిన అనుభూతిని నగరవాసులకు కెసిఆర్ రుచి చూపించారు.
ఎన్వీఎస్ రెడ్డి కృషి ఎంతో...
హైదరాబాద్ మెట్రో రైలు కార్యరూపం దాల్చడం వెనక ఎండి ఎన్వీఎస్ రెడ్డి కృషి ఎంతో ఉంది. రాజకీయాలకు అతీతంగా ఆయన అందరు ముఖ్యమంత్రులతోనూ ఎప్పటికప్పుడు చర్చిస్తూ దాన్ని సాకారం చేశారు. రాజకీయాలు వేరు, చిత్తశుద్ది గల అధికారుల కృషి వేరు అనేది తప్పకుండా చూడాల్సే ఉంటుంది.