విషాదం: స్కూటీని ఢీకొట్టిన లారీ, కుటుంబంలోని ముగ్గురు మృతి
బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పిద్దామని వెళ్తున్న ఓ కుటుంబాన్ని లారీ రూపంలో మృత్యువు మింగింది. ఈ విషాధ సంఘటన కూకట్పల్లి వివేకానంద నగర్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది.
హైదరాబాద్: బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పిద్దామని వెళ్తున్న ఓ కుటుంబాన్ని లారీ రూపంలో మృత్యువు మింగింది. ఈ విషాధ సంఘటన కూకట్పల్లి వివేకానంద నగర్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది.
వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో కుటుంబంలోని ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు. రామచంద్రాపురంలోని ఇసుకబావి సమీపంలో ఉండే నర్సింహులు, లలిత భార్యాభర్తలు. కూలీ పని చేసుకొని జీవనం సాగించే వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆదివారం ఉదయం బల్కంపేట ఆలయంలో మొక్కు తీర్చుకోవడానికి స్కూటీపై నర్సింహులు, లలిత, చిన్న కుమార్తె శిరీష బయలుదేరారు. కూకట్పల్లి వివేకానందనగర్ చౌరస్తాకు రాగానే సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది.
దీంతో వారు కింద పడగానే వారిపై నుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మల్లంపేటకు చెందిన మచ్చగిరి అనే జీహెచ్ఎంసీ కార్మికుడికి కూడా గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పారిపోయాడని, కేసు నమోదు చేశామని తెలిపారు. సమయం దాటిన తర్వాత సిటీలోకి భారీ వాహనాలను అనుమతించారని, కొందరి అవినీతే ఈ ప్రమాదానికి కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.