ఒక్క సీటు గెలిచినా బీజేపీ కాలర్ ఎగరేస్తోంది.. మున్సిపోల్స్లో సమిష్టిగా పనిచేయాలన్న కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ క్రమంగా పుంజుకుంటుంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలతో అది రుజువైంది. దీంతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలపై అలర్టైంది. ముఖ్యంగా బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని సూచిస్తోంది. తమ పార్టీ లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
మున్సిపోల్స్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆయా మున్సిపాలిటీల్లో బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం సాధించేందుకు కష్టపడాలని సూచించారు. ముఖ్యంగా తాండూర్, మేడ్చల్ జిల్లాల్లోని మున్సిపాలిటీలో అలర్ట్గా ఉండాలని సూచించారు. అంతేకాదు బీజేపీ ఒక్క మున్సిపాలిటీ గెలిచినా .. తమకు కష్టాలు ఎక్కవుతాయని పేర్కొన్నారు. వారు కాలర్ ఎగరేసే పరిస్థితి ఉంటుందని తేల్చిచెప్పారు.
శుక్రవారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇంచార్జీలతో కేటీఆర్ సమావేశమై .. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించారు. సభ్యత్వ రుసుం ద్వారా పార్టీకి రూ.14 కోట్లు జమయ్యాయని పేర్కొన్నారు. అయితే ఆరు నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం లేదని .. ఈ సందర్భంగా ముఖ్య నేతలు తెలిపారు. దీంతో అందరు కలిసికట్టుగా పనిచేయాలని కేటీఆర్ స్పష్టంచేశారు. మున్సిపోల్స్లోనూ కారు జోరు కొనసాగాలని .. ఇందుకోసం అందరూ ఒక్కటే పనిచేయాలని కేటీఆర్ తేల్చిచెప్పారు.