ఎన్టీఆర్ను దగ్గరగా చూడలేదన్న రేవంత్.. 'అసలేం తెలుసు నీకు?'
అసెంబ్లీ లాబీలో.. ఎన్టీఆర్ గురించి అసలు నీకేం తెలుసని మాగంటి గోపి రేవంత్ ను ప్రశ్నించారు.
హైదరాబాద్: టీడీపీ మూల పురుషుడు, వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ ఆ పార్టీ నేతలందరికీ ఆరాధ్య నేత. సమయం.. సందర్బాన్ని బట్టి తెలుగు తమ్ముళ్లు ఆయన మీద తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి గడ్డు రోజులు నెలకొనడంతో.. ఆ పార్టీ భవిష్యత్తు ఉనికి ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. పార్టీ నేతలు కూడా అధినేత చంద్రబాబును తలుచుకున్నంతగా ఎన్టీఆర్ గురించి అంతగా ప్రస్తావించినట్టు అనిపించదు.
ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య 'ఎన్టీఆర్'పై ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీ లాబీల్లో వీరిద్దరు ఎదురుపడ్డారు. ఆ సమయంలో.. ఎన్టీఆర్ గురించి అసలు నీకేం తెలుసని మాగంటి గోపి రేవంత్ ను ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా.. అవును.. నాకు ఆయన గురించి తెలియదు, కనీసం దగ్గరినుంచి కూడా ఎప్పుడూ చూడలేదని రేవంత్ బదులిచ్చారు. మళ్లీ ప్రశ్నలందుకున్న మాగంటి గోపి.. 'పార్టీ కార్యాలయంలో కొత్త ఛాంబర్లోకి వెళ్తూ పెద్దమ్మ గుడి నుంచి వెళ్లావు కదా.. అభిమానముంటే ఎన్టీఆర్ ఘాట్ నుంచి వెళ్లేవాడివి' అని విమర్శించారు.
మాగంటి గోపికి కౌంటర్ గా 'పార్టీ ఫిరాయించినప్పుడు నువ్వు ఘాట్ నుంచే వెళ్లావా' అని రేవంత్ ఆయన్ను ప్రశ్నించారు. దీంతో తాను డైరెక్ట్ గా అసెంబ్లీకే వచ్చానని గోపి చెప్పారు. ఇక దీనికి కొనసాగింపుగా.. 'నేను పెద్దమ్మ గుడి నుంచి బయలుదేరినా ఎన్టీఆర్ భవన్కే వెళ్లానని' రేవంత్ అన్నారు.
ఇక టీడీపీ గురించి ప్రస్తావించిన మాగంటి గోపి.. అప్పట్లో టీడీపీ నన్నసలు పట్టించుకోలేదన్నారు. ఎనిమిది నెలల పాటు తనకు గన్ మెన్స్ ను కూడా ఇవ్వలేదని అన్నారు. ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లే పార్టీ మారారని ఈ సందర్బంగా మాగంటి రేవంత్ కు గుర్తుచేశారు.