వివాదం: ఐపీఎస్ ప్రవీణ్పై చర్యలకు బీజేపీ విష్ణు వర్దన్ డిమాండ్... స్వేరోస్ చీఫ్ రియాక్షన్ ఇదీ...
అన్ని మతాలను,కులాలను,విశ్వాసాలను గౌరవించాలని... మంచి అన్నది ఏ ప్రాంతంలో ఉన్న స్వీకరించాలని... స్వేరోయిజం ఇదే చెప్తుందని.. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి,ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.ఒక కులాన్ని గానీ,మతాన్ని గానీ,ఒక ప్రాంతాన్ని గానీ,ఒక దేశాన్ని గానీ నిందించడం భీమ్ దీక్షలో,స్వేరోయిజంలో లేదని తెలిపారు. సోమవారం(మార్చి 15) పెద్దపల్లి జిల్లా ధూళికట్టలోని బౌద్ద క్షేత్రంలో భీమ్ దీక్ష ప్రారంభోత్సవంలో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ఇదే వేదికపై చేసిన బుద్ద వందనం ప్రతిజ్ఞ వివాదాస్పదం కావడంతో దానిపై ఆయన తన ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.
అసలేం జరిగింది...
ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్న భీమ్ దీక్ష కార్యక్రమంలో ఓ కుటుంబం చేసిన బుద్ద వందనం ప్రతిజ్ఞ వివాదాస్పదంగా మారింది. ఇందులో హిందూ దేవీ దేవతలను కించపరిచారని ఏపీ బీజేపీ నేత విష్ణు వర్దన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి చిన్న పిల్లల మెదళ్లలో విష బీజాలు నాటుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఇదేనా మీరు ఐపీఎస్లో శిక్షణ పొందింది... బహిరంగంగా హిందూ దేవీ దేవతలను కించపరుస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై తెలంగాణ సీఎంవో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు,ఇదే వీడియోను 'ఇది నిజమా లేక ఆడియో మార్ఫింగా చేశారా..?' అని బీజేపీ మహిళా మోర్చా ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.
ఐపీఎస్ ప్రవీణ్ వివరణ...
భీమ్ దీక్షలో ప్రతిజ్ఞపై చెలరేగిన వివాదంపై ఐపీఎస్ ప్రవీణ్ తన ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. 'పెద్దపల్లి జిల్లా ధూళికట్టలో జరిగిన స్వేరోల పవిత్ర నెల(మార్చి 15-ఏప్రిల్ 14) ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ బుద్దుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. అనంతరం ఓ బుద్దిస్ట్ కుటుంబం వేదిక పైకి వచ్చింది. ఈ సందర్భంగా వారు బుద్ద వందనం చేశారు. అదే సమయంలో 1956లో డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ నాగపూర్లోని దీక్ష భూమిలో బుద్దిజం స్వీకరించిన సందర్భంగా చేసిన ప్రమాణాన్ని చదివారు.' అని చెప్పుకొచ్చారు.
స్టేజీ పైనే ఆ విషయాన్ని ప్రకటించాం : ఐపీఎస్ ప్రవీణ్
'నేనిక్కడ స్పష్టత ఇవ్వదలుచుకున్నాను... ఆ ప్రతిజ్ఞ చేసిన కుటుంబంతో నాకు గానీ మా స్వేరో ప్రతినిధులకు గానీ ఎటువంటి సంబంధం లేదు. ఆ కుటుంబం చేసిన ప్రమాణంతో మాకు సంబంధం లేదని బుద్ద వందనం అనంతరం స్టేజీ పైనే ప్రకటించాం. ఒకవేళ దాని కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దానికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. స్వేరోయిజంలో అన్ని మతాలకు చెందినవారు ఉన్నారు. అన్ని మతాల్లో నుంచి మేము మంచి విలువలను స్వీకరిస్తాం. మా ఇళ్లల్లో గానీ పని ప్రదేశాల్లో గానీ ఏ మతం పట్ల మేము పక్షపాత వైఖరిని,వ్యతిరేకతను బోధించం.' అని స్పష్టం చేశారు. అలాగే ధూళికట్ట బౌద్ద క్షేత్రంలో తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా ఐపీఎస్ ప్రవీణ్ జతచేశారు.
మార్ఫింగ్ వీడియో అంటున్న స్వేరోలు...
మరోవైపు బీజేపీ నేతలపై స్వేరో ప్రతినిధులు,విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. కల్పిత,మార్ఫింగ్ వీడియోలతో ఐపీఎస్ ప్రవీణ్పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని చెబుతున్నారు. మార్ఫింగ్ ఆడియోతో దుష్ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చాలామంది నెటిజన్లు,స్వేరో విద్యార్థులు #standwithpraveenips అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అసలేంటీ భీమ్ దీక్ష...
ప్రతీ ఏటా మాన్యవర్ కాన్షీరాం జయంతితో మొదలుకొని ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి దాకా భీమ్దీక్షలను స్వేరో (సోషల్ వెల్ఫేర్ ఏరోస్) నిర్వహిస్తోంది. పుట్టిన కులానికి తప్ప వ్యక్తికి గుర్తింపు ఇవ్వని సమాజంలో... మనిషికి అంటగట్టిన కులాన్ని రద్దు చేసి ఎలాంటి హీనమైన గుర్తింపులు లేకుండా చేయడమే భీమ్ దీక్ష ప్రధాన ఉద్దేశం. జ్ఞాన సమాజం ద్వారానే సమ సమాజ స్థాపన జరుగుతుందని.. అందుకే విద్యే ప్రధాన ఆయుధమని దీని ద్వారా బోధిస్తున్నారు. తెలంగాణలో పేద,అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఎంతోమంది విద్యార్థులు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల ద్వారా ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.