సికింద్రాబాద్-అయోధ్య ఎక్స్ప్రెస్కు ఏపీలో హాల్ట్ స్టేషన్లు, ఛార్జీలు ఇవే
Secunderabad-Ayodhya express: తెలుగు రాష్ట్రాల్లో మరో విడత భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ పట్టాలు ఎక్కబోతోంది. త్వరలో సికింద్రాబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య, వారణాశికి బయలుదేరి వెళ్లనుంది. దీనికి సంబంధించిన ప్యాకేజీని తాజాగా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది.
దేశంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ.. భారత్ గౌరవ్ పేరుతో ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రారంభమైన అన్ని చోట్ల కూడా ప్రయాణికుల ఆదరణ భారీగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీసీ జోన్ల వారీగా భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లను మరింత విస్తృతపరుస్తోంది. వాటి ట్రిప్ల సంఖ్యనూ పెంచుతోంది.

ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి అయోధ్య, వారణాశికి మరో ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకుని వచ్చింది ఐఆర్సీటీసీ.ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్తగా ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. తొమ్మిది రాత్రులు/10 పగళ్లు ఈ యాత్ర సాగుతుంది.
ఈ నెల 11వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిరతో పాటు ఏపీలోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లల్లో ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం ఉంది.
ఈ ప్యాకేజీలో పూరీ- కోణార్క్- గయ- వారణాశి- అయోధ్య- ప్రయాగ్ రాజ్ ఉన్నాయి. పూరీలో జగన్నాథ స్వామివారి ఆలయం, కోణార్క్లో సూర్య దేవాలయాన్ని సందర్శించవచ్చు. గయలో విష్ణుపాద, వారణాశిలో కాశీ విశ్వనాథుడు, అక్కడి కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయాలను సందర్శించవచ్చు. సాయంత్రం గంగా హారతిని తిలకించవచ్చు.
అయోధ్యలో శ్రీరామచంద్రులవారి ఆలయం, హనుమాన్ గర్హి, హారతి, అత్యంత ప్రాచీనమైన సరయూ నదిని దర్శించవచ్చు. ప్రయాగ్ రాజ్లో త్రివేణి సంగమం సందర్శనతో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. ప్రయాగ్ రాజ్ నుంచి మళ్లీ సికింద్రాబాద్కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 16,800 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 15,690 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. థర్డ్ ఏసీలో పెద్దలకు 26,650, పిల్లలకు 25,340 రూపాయలు, సెకెండ్ ఏసీ పెద్దలకు 34,910, పిల్లలకు 33,330 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications