'టీ' ఖజానా ఖాళీ: నెల రోజులుగా నిలిచిన చెల్లింపులు..!
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అయితే ఏడాది తిరిగేలోగానే ఆ రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్గా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం విధించిన ఫ్రీజింగ్ ప్రభావంతో నెల రోజులుగా కేవలం అత్యవసర చెల్లింపులకే పరిమితమయ్యాయి.
అత్యవసర చెల్లింపులు మినహా మిగిలిన అన్ని రకాల చెల్లింపులూ నిలిపివేయాలంటూ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ నుంచి అన్ని జిల్లాల ఖజానా అధికారులకు గత నెల 26న మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో పాటు మధ్యాహ్న భోజన పథకానికి కూడా నిధుల విడుదల నిలిచిపోయింది.
విద్యార్ధుల ఫీజు బకాయిల చెల్లింపులను నిలిపివేసిన ప్రభుత్వం, పంచాయితీల విద్యుత్ బిల్లులకూ పైసా కూడా విడుదల చేయడం లేదు. ఒకేసారి బిల్లులన్నీ నిలిచిపోయిన విషయం బయటకు పొక్కడంతో తెలంగాణ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్లపైచిలుకు బిల్లులు నిలిచిపోయాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్. ఉపకారవేతనాల బకాయిలకు కూడా నిలిపవేశారు. దీంతో 2014-15లో కోర్సులు పూర్తి చేసుకున్నవారికి కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపేశాయి. తదుపరి చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా, బకాయిల విడుదల కోసం ఆర్థిక శాఖ అధికారులతో సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఫీజుల బకాయిల విడుదలలో ఆలస్యమైనా ఇబ్బంది లేదు కానీ, ఉపకారవేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.
వీరికి ఆగస్టు మొదటివారంలో చెల్లింపులు చేసే అవకాశం ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపినట్లు సమాచారం. ట్రెజరీ ఖాలీ ఆయిందంటూ మీడియాలో వస్తున్న కథనాలు అభూతకల్పనంటూ ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications