తెలంగాణ జనమెవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్!!
హైదరాబాద్ : డిమాండ్స్ విషయంలో దాని ఊసే లేదు.. కొత్త జాబితాలో దాని పేరుంటుందని అక్కడి జనం కూడా ఊహించలేదు. జిల్లాలో ఓ సాధారణ పట్టణం కిందే ఉంది కాబట్టి.. రామగుండం లాంటి ప్రాంతాన్ని పక్కనబెట్టి.. పెద్దపల్లిని జిల్లా చేస్తారన్న విషయం అసలెవరి ఊహకు అందనిది. కానీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల లెక్క వేరు.. సీఎం కేసీఆర్ లెక్క వేరు.. అందుకే పెద్దపల్లి ఇప్పుడు జిల్లా కేంద్రంగా అవతరించనుంది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఆయా ప్రతిపాదిత జిల్లాల డ్రాఫ్టులను సీఎం కేసీఆర్ ముందుంచిన అధికారులు, ప్రజా ప్రతినిధులు.. తెలంగాణ భౌగోళికతపై కేసీఆర్ కు ఉన్న పట్టు చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనైనట్లు తెలుస్తోంది. కరీంనగర్ ను మూడు జిల్లాలుగా విభజించాలన్న ప్రతిపాదన తొలుత తెర మీదకు వచ్చింది. కరీంనగర్ తో పాటు మిగతా రెండు జిల్లాల కోసం జగిత్యాల, సిరిసిల్ల మాత్రమే ప్రతిపాదనలో ఉన్నాయి.
అయితే కేబినెట్ సబ్ కమిటీ చర్చలో మాత్రం సిరిసిల్ల పేరు ప్రస్తావనకు రాకపోవడంతో.. రామగుండంను జిల్లాగా చేయాలని స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సూచించారు. విస్తీర్ణం పరంగాను, జనాభా పరంగాను రామగుండం పెద్ద పట్టణంగా ఉండడం.. సింగరేణి, ఎన్టీపీసీ, ఎరువుల కర్మాగారం లాంటి పరిశ్రమలతో పారిశ్రామికంగాను అభివృద్ధి చెంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉండడంతో జిల్లా కేంద్రంగా రామగుండం అయితే ప్రజానుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే సోమారపు సీఎం కేసీఆర్ కు వివరించారు.
అదీగాక.. రైల్వే పరంగాను రామగుండం ప్రముఖంగా ఉండడంతో జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుకూలతలు రామగుండంలో ఉన్నాయని కేసీఆర్ కు తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఈ నిర్ణయానికి సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో రామగుండం జిల్లా ప్రతిపాదనను ప్రస్తావిస్తూ.. కేబినెట్ సబ్ కమిటీ కేసీఆర్ ముందు నివేదికలు పెట్టింది.
కేసీఆర్ లెక్క వేరు ;
అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. రామగుండంను కాకుండా పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రస్తావన తీసుకొచ్చి.. సోదాహరణంగా నేతలకు వివరించారట కేసీఆర్. రామగుండం ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ది చెందిన ప్రాంతం కావడంతో.. వాహనాల రద్దీతో పాటు, కొత్త జిల్లాల ఏర్పాటుకు అవసరమైన భూ లభ్యత రామగుండంలో లేదని కేసీఆర్ చెప్పారట.
పైగా.. పెద్దపల్లి ఇప్పటికే రెవెన్యూ డివిజన్ కావడం, ప్రభుత్వ కార్యాలయాలకు సరిపడా భూములు ఉండడం, రైల్వే జంక్షన్, అదీగాక.. కొత్తగా ఏర్పాటయ్యే జగిత్యాల జిల్లాకు, కరీంనగర్ కు పెద్దపల్లి సెంటర్ లో ఉండడం పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా చేయడానికి అనుకూలంగా ఉంటాయని వివరించారట కేసీఆర్. మరోవైపు మంథని నియోజకవర్గ ప్రజలకు కూడా పెద్దపల్లి దగ్గరలోనే ఉండడం జిల్లా కేంద్రం అవడానికి పెద్దపల్లికి కలిసొచ్చే అంశాలని.. ఇలా అన్నింటిని లెక్కగట్టి చెప్పుకొచ్చారట.
దీంతో సీఎం కేసీఆర్ చెప్పిన లెక్కలు చూసి.. అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా కేసీఆర్ నిర్ణయమే భేష్ అన్న ఆలోచకు వచ్చారట. అలా మొత్తంగా పెద్దపల్లి జిల్లా ఏర్పాటు ఖాయమైంది. అయితే భౌగోళికంగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో.. ప్రతిపాదనకు వచ్చిన ప్రతీ అంశాన్ని కేసీఆర్ భౌగోళికంగా విడమర్చి చెప్పడంతో.. ఆయన లెక్కలను, తెలంగాణపై ఆయనకున్న పట్టును చూసి నేతలే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారట.
ఇకపోతే జిల్లాలో రామగుండం లాంటి పెద్ద పట్టణం ఉన్నా.. పక్కనే ఏర్పాటవనున్న మంచిర్యాల జిల్లా రామగుండంకు అతి సమీపంలోనే ఉండడం కూడా రామగుండం జిల్లా ప్రతిపాదనను పక్కనబెట్టేసినట్లుగా తెలుస్తోంది. అటు పెద్దపల్లి, ఇటు మంచిర్యాల రెండింటి మధ్యలో రామగుండం పెద్ద పట్టణంగా ఉండనుంది. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయానికి అవసరమయ్య భవనాలను పెద్దపల్లిలో అధికారులు గుర్తించినట్లుగా సమాచారం.