షాకిచ్చిన జగ్గారెడ్డి: నాడు పవన్ కళ్యాణ్తో భేటీ కేవలం అందుకేనా?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి.. మెదక్ లోకసభ ఉప ఎన్నికకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కారణం అనే వాదనలు వినిపించాయి. అయితే, జగ్గారెడ్డి సోమవారం నాడు పెద్ద షాకిచ్చారు.
ఆయన సోమవారం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిజెపిలో చేరారు. ఆయన చేరిక వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారనే వార్తలు వచ్చాయి.
కానీ, ఆయన మాత్రం సోమవారం మాట్లాడుతూ... తనకు చంద్రబాబు ఫోన్ చేయడంతో బిజెపిలో చేరానని చెప్పారు. ఇది చాలామంది ఊహించని విషయమేనని చెప్పవచ్చు.
మెదక్ ఉప ఎన్నికలకు ముందు, బిజెపిలో చేరడానికి ముందు.. జగ్గారెడ్డి జనసేన అధినేతను కలవడం చర్చకు దారి తీసింది. ఆ సమయంలో పవన్, జగ్గారెడ్డిలు పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు.
పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తనకు ఎంతో నచ్చాయని జగ్గారెడ్డి నాడు చెప్పారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి తాను పని చేస్తానని కూడా అన్నారు. ఏవిధంగా ఆయనతో కలిసి పని చేసేది కాలమే నిర్ణయిస్తుందన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తెలంగాణలో బలమైన ప్రతిపక్షం అవసరమని, తెలంగాణ విషయంలో జగ్గారెడ్డి వ్యవహరించిన తీరు తనకు నచ్చిందని, తాను జగ్గారెడ్డితో కలిసి పని చేస్తానని, జగ్గారెడ్డి భావాలు తనకెంతో నచ్చాయన్నారు. ఒకవైపు తెలంగాణవాదం గురించి మాట్లాడుతూనే ఇరుప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం జగ్గారెడ్డి తపించారన్నారు. పవన్ను జగ్గారెడ్డి కలిసినప్పుడే ఆయన బిజెపిలో చేరుతారని అందరూ భావించారు.
ఊహించినట్లుగా ఆయన బిజెపిలో చేరారు. ఆ తర్వాత వచ్చిన మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇంతకాలం ఆయన బిజెపిలో ఉన్నారు. జగ్గారెడ్డి బిజెపిలో చేరడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ, సోమవారం జగ్గారెడ్డి.. చంద్రబాబు కారణంగా బిజెపిలో చేరానన్నారు.
పవన్ కళ్యాణ్ మద్దతుతో గెలవాలనేనా..
మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో నాడు పోటీ చేసిన జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా.. బిజెపిలో చేరుదామని భావించి పవన్ కళ్యాణ్ను కలిసి ఉంటారని, టిడిపి - బిజెపి మద్దతుతో పాటు పవన్ను నేరుగా కలిస్తే తనకు అది ఉపయోగపడుతుందని భావించే ఆయన కలిసి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. బిజెపి తరఫున ఎలాగు గెలవలేదు కాబట్టి ఇప్పుడు తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.