ప్రతిపక్షాలపై మంత్రి హరీశ్ మండిపాటు, సభలో మంత్రుల తీరు సరిగా లేదన్న జానా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, మండలిని చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. క్వశ్చన్ అవర్ లేకుండానే నేరుగా రైతు సమస్యలపై చర్చిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలపై సభలో చర్చించే అజెండాలో రుతుపవనాలను పెట్టమేంటని తెలంగాణా శాసనసభ ప్రతిపక్ష నేత జానా రెడ్డి ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, కరువు పరిస్థితులపై చర్చించాల్సి ఉందన్నారు. వ్యవసాయంపై చర్చ జరగాలని పట్టుబడ్డారు. ఈ సమయంలో హరీష్రావు కల్పించుకుని రైతు ఆత్మహత్యలపై సీఎం కేసీఆరే నేరుగా చర్చ చేపట్టాలని నిర్ణయిస్తే ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.
రైతులపై ప్రతిపక్షాలకు నిజంగా ప్రేమ ఉంటే రైతు సమస్యలపై చర్చకు సహకరించాలని కోరారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్ష నేత జానారెడ్డి సభలో మంత్రల వైఖరి సరిగా లేదన్నారు. నిజాయితీ ఉంటే చిత్తశుద్ది ఉంటే రైతు సమస్యలపై మంచి సూచనలు చేయండన్నారు.
ఆత్మహత్యల పాపం మాపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో మా ప్రభుత్వంలో జరిగిన ఆత్మహత్యలు, ఇప్పుడు జరిగిన ఆత్మహత్యలపై గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ మంత్రులు మాట్లాడుతున్న తీరు సరైంది కాదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడే సమస్యలు కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ సమస్య కాదన్నారు.
ఈ సమస్య ప్రజల సమస్య అని, ప్రజల యొక్క ఆవేదన అని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల బాధలను మీ ముందుకు తీసుకు రావడం మా బాధ్యత, ఆయా ప్రజల సమస్యలను పరిష్కారాలు ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. అసెంబ్లీలో మేం ప్రస్తావించేది ప్రజల బాధలను మాత్రమే, మా బాధలను కాదన్నారు.
ఈ సమయంలో సీఎం కేసీఆర్ కలగజేసుకుని రైతుల సమస్యలపై చర్చించేందుకు రెండు రోజుల సమయం కేటాయించామన్నారు. దీనిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, దానికి అనుగుణంగానే రైతు సమస్యలపై చర్చ ప్రారంభించామన్నారు. బీఏసీలో అంశాలను స్పీకరే నిర్ణయించారని, మేం కాదని అన్నారు.
నిందారోపణలు అనవసరమని, వివరణాత్మకమైన చర్చ అవసరమన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలన్నారు. ఉత్తమమైన సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని సీఎం తెలిపారు.
సభలో నెగిటివ్ భావన ఎందుకు మాట్లాడతారంటూ చెప్పిన సీఎం, రైతుల సమస్యలపై ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడండి. అన్ని అంశాలపై చర్చిందేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ అన్నారు.