బిచ్చగాళ్లమా, కెసిఆర్కు మేమే బట్టలు, బిర్యానీ పంపిస్తాం: మత్తయ్య
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన జెరూసలేం మత్తయ్య సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ క్రైస్తవు సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసమే ప్రభుత్వం క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తోందన్నారు.
క్రైస్తవులు బిచ్చగాళ్లు కాదని, తామే కెసిఆర్కు దుస్తులు, బిర్యానీ ప్యాకెట్లు పంపిస్తామని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నిర్వహించే క్రైస్తవ వేడుకలను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. క్రైస్తవులకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
కాగా, క్రిస్మస్ పండుగ నేపథ్యంలో రెండువేల మంది క్రైస్తవులకు దుస్తులు తదితరాలను పంపిణీ చేస్తామని, ఈ పండుగ తరఫున నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మత్తయ్య ముఖ్యమంత్రి పైన మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య ఏ4 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు తెలుగు రాష్ట్రాలలో కొద్ది నెలల క్రితం సంచలం రేపాయి. ఓటుకు నోటు కేసులో మత్తయ్య నిందితుడు. ఇరువురు సీఎంలు కలిసిపోవడం వెనుక తన ప్రయత్నమే ఉందని మత్తయ్య కొద్ది రోజుల క్రితం చెప్పారు.