కేసీఆర్.. మైండ్ గేమ్ మానుకో: మత్తయ్య, తెలుగు యువత ఘాటు వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మైండ్గేమ్ మానుకోవాలని 'ఓటుకు నోటు' కేసులో నాలుగో నిందితుడు, ఆలిండియా దళిత క్రిస్టియన్ సమాఖ్య కార్యదర్శి జెరూసలెం మత్తయ్య అన్నారు.
సోమవారం మీడియా ముందుకు వచ్చిన మత్తయ్య ఏపీలోని విజయవాడలో ఓ తెలుగు దినపత్రికతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ కలిసి కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో లేని ఆధారాలను సృష్టించేందుకు డ్రైవర్, ఆఫీస్ బాయ్ స్థాయి ఉద్యోగులను 164 స్టేట్మెంట్ పేరిట ఏసీబీ అధికారులు వేధిస్తున్నాయని తెలిపారు. కేసుపై అవగాహన, రాజకీయ తెలివితేటలు లేని కింది స్థాయి సిబ్బందిని విచారణ పేరుతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.
అసలు ఓటుకు నోటు కేసే లేదని, అదంతా తెలంగాణ ప్రభుత్వ అద్భుత సృష్టి అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఇకనైనా తన మైండ్ గేమ్ను మార్చుకోవాలని అన్నారు.
తెలంగాణ ఏసీబీపై 'తెలుగు యువత' ఘాటు వ్యాఖ్యలు
ఓటుకు నోటు కేసులో రోజుకో కొత్త అంశాన్ని వెలికితీస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులపై టీడీపీ యువజన విభాగం తెలుగు యువత నేత ప్రదీప్ చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తన ప్రమేయానికి సంబంధించి ఏసీబీ అధికారులకు ఏమీ తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
ఓటుకు నోటు కేసులో సోమవారం ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగిన విచారణ అనంతరం బయటకు వచ్చిన ప్రదీప్ చౌదరి మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటుతో సంబంధముందా? అని కూడా ఏసీబీ ప్రశ్నించిందన్నారు.
కేసుతో తనకెలాంటి సంబంధం లేని చెప్పానని అన్నారు. అసలు ఈ కేసులో తన ప్రమేయం లేకుండా, తనని విచారణకు ఎందుకు హాజరవ్వాలని ఆదేశించారో ఏసీబీకే తెలియడం లేదని వ్యాఖ్యానించారు.