కేసీఆర్ సర్కారుదే బాధ్యత: ప్రజాస్వామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరు: హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా
హైదరాబాద్: కరోనా నిబంధనలతోనే తాము ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. జేపీ నడ్డాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర నేతలు రాజా సింగ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, విజయశాంతి తదితరులు ఘనస్వాగతం పలికారు. భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. జాయింట్ సీపీ కార్తీకేయ తనను కలిశారని, నోటీసులు ఇచ్చారని తెలిపారు. తాను కరోనా నిబంధనలు పాటిస్తానని చెప్పానని తెలిపారు. బాధ్యత గల పౌరుడిగా నిబంధనల మేరకు నడుకుంటాను. అయితే, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తన ప్రజాస్వామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు.
కాగా, బీజేపీ ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. కరోానా నిబంధనలు అమలులో ఉన్న క్రమంలో జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరగాల్సిన క్యాండిల్ ర్యాలీ విరమించుకున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి జేపీ నడ్డా, ఇతర నేతలు సికింద్రాబాద్ బయల్దేరారు. గాంధీ విగ్రహానికి పూల మాల వేశారు జేపీ నడ్డా.
Recommended Video
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు, 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో 14 రోజులపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించారు. కాగా, రాష్ట్రంలో కరోనా నిబంధనలతో ఎలాంటి ర్యాలీలు, బహిరంగసభలకు అనుమతి లేదని, అందుకే కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, బీజేపీ కార్యాలయంలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడనున్నారు.