ఎర్రబెల్లిని రానివ్వం: కడియం, కేసీఆర్పై కుతకుత
వరంగల్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు తెరాసలోకి వెళ్లనున్నారనే ప్రచారం కొద్ది రోజుల క్రితం జరగగా, ఇటీవల ఆయన మళ్లీ యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన యూటర్న్ వెనుక వరంగల్ జిల్లాకే చెందిన తెరాస నేత, ఎంపీ కడియం శ్రీహరి అడ్డుకోవడమేననే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై కడియం మంగళవారం మాట్లాడారు. తాము ఎర్రబెల్లిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి రానివ్వమని చెప్పారు. తెలంగాణ ద్రోహిగా పని చేసిన ఎర్రబెల్లిని తెరాసలోకి రాకుండా అడ్డుకుంటామన్నారు. తెరాస, నేతలు గడ్డి పీకుతున్నారా... అంటూ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యల పైనా కడియం విరుచుకుపడ్డారు.
తెరాసలో చేరేందుకు కాకపోతే, అర్ధరాత్రి కేసీఆర్ వద్దకు ఏం పీకేందుకు వెళ్లావని ధ్వజమెత్తారు. తాను తెరాసలో చేరుతానా అన్న తన మాటకు ఎర్రబెల్లి కట్టుబడి ఉండాలన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ, రేటింగ్ పెంచుకునేందుకు ఎర్రబెల్లి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దయాకర్రావును ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్లోకి రానివ్వమన్నారు.
తెరాసలో టీడీపీ సెగ రాజుకుంటోంది. టీడీపీ నుంచి ఇప్పటికే పార్టీలో చేరిన వారు, చేరబోతున్న వారి వ్యవహారం తెరాసలో అంతర్గతంగా చర్చనీయాంశమైంది. టీడీపీ నేతలను చేర్చుకునే విషయంలో కేసీఆర్ తీరును బయటికి తప్పుపట్టే సాహసం ఎవరూ చేయనప్పటికీ, లోలోన మాత్రం చాలామంది నేతలు కుతకుతలాడుతున్నారని అంటున్నారు. ఎప్పటి నుండో పార్టీ కోసం, ఉద్యమంలో పాల్గొన్న తమను కాదని టీడీపీ నేతలను చేర్చుకోవడంపై వారు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.