అప్పు ఇప్పించండి!: కడియం, ధనికులమన్నారుగా: ఒంటికాలిపై లేచిన కిషన్
హైదరాబాద్: రైతుల రుణమాఫీ విషయంలో శాసన సభలో బుధవారం నాడు అధికార, విపక్షాల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిల మధ్య వాగ్వాదం జరిగింది.
రైతుల అప్పులు ఒకేసారి తీర్చాలని విపక్షాలు అధికార టిఆర్ఎస్ పార్టీని సభలో నిలదీశాయి. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ... కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.8వేల కోట్లను అప్పుగా ఇప్పిస్తే రైతుల రుణాలన్నీ ఒకేసారి రద్దు చేయడానికి వీలు అవుతుందని చెప్పారు.
దీనిపై కిషన్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని అడిగే రుణమాఫీ పైన ఎన్నికల్లో వాగ్ధానం చేశారా అని నిలదశారు. బుధవారం రాత్రి రైతుల సంక్షేమం కోసం ప్రభు్తవం తీసుకున్న చర్యల పైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
బిజెపి నేతలు కేంద్రం నుంచి ఎనిమిది వేల కోట్లు అడ్వాన్స్ గ్రాంటుగా మంజూరు చేయిస్తే విడతల వారీగా ఆ మొత్తాన్ని తిరిగి కేంద్రానికి చెల్లిస్తామన్నారు. బిజెపి సభ్యులు ముందుకు వస్తే తక్షణం తీర్మానం ప్రవేశ పెడతామని కడియం చెప్పారు.
కిషన్ రెడ్డి దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. బిజెపిని అడిగే రైతు రుణమాఫీ అంశాన్ని పెట్టారా అని ప్రశ్నించారు. దానికి కడియం స్పందిస్తూ... ఎవర్ని అఢిగి బీహార్ రాష్ట్రానికి రూ.వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చారన్నారు.
దానికి కిషన్ రెడ్డి స్పందిస్తూ... ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ అని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనలు చేశారని, రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అనంతరం.. శాసన సభ సమావేశాల అనంతరం ఢిల్లీకి వెళ్దామని మంత్రులు సూచించారు.