ఈసీ నోటీసు వచ్చిందని ఒప్పుకున్న కవిత: టిడిపి నేతలపై ఆంధ్రజ్యోతి కౌంటర్
హైదరాబాద్: టిఆర్ఎస్ నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల ఎన్నికల సంఘం నోటీసుల పైన మరోసారి స్పందించారు. ఎన్నికల్లో లెక్కల విషయమై ఈసీ కవితకు నోటీసు ఇచ్చిందని ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. దీనిపై ఆమె రెండు రోజుల క్రితం స్పందిస్తూ... తనకు నోటీసులు రాలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా, ఆమె మరోసారి స్పందించారు. ఈసీ నోటీసు తనకు వచ్చిందని అంగీకరించారు. నోటీసు వచ్చాక.. ఈసీకి సమాధానం కూడా ఇచ్చామని పేర్కొన్నారు. అయితే, అది తన హైదరాబాదు అడ్రస్కు రాలేదని, తమ ఏజెంటే నేరుగా దానిని తీసుకున్నారని చెప్పారు.
నోటీసు ఎవరు తీసుకున్న బాధ్యత అభ్యర్ధిదేనని చెప్పారు. రెండు రోజుల్లోనే దానికి వివరణ ఇచ్చామని కవిత చెప్పారు. అదే సమయంలో కవిత మాట్లాడుతూ... తాను వివరణ ఇచ్చిన విషయం ఆంధ్రజ్యోతి దాచి పెట్టిందని, అలాగే టిడిపి గురించి ఎందుకు రాయడం లేదని ప్రశ్నించింది.
టిడిపి నేతల గురించి రాయరేం అన్న వ్యాఖ్యలకు ఆంధ్రజ్యోతి కూడా కౌంటర్ ఇచ్చింది. టిడిపి అభ్యర్థుల పైన తమకు ఫిర్యాదులు లేవని, ఆధారాలు ఉంటే ఇవ్వాలని పరిశీలించి రాస్తామని చెప్పారు.
కాగా, ఎన్నికల సంఘం కవితకు నోటీసులు పంపించిందని చెప్పగా, తనకు నోటీసులు రాలేదని, ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ఏమైనా పోయాయేమోనని కవిత వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.