కేసీఆర్ స్ట్రాటజీ: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు...2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితేనే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆదివారం 25లక్షల మందితో జరగనున్న భారీ బహిరంగ సభను వేదిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ వేదికపై నుంచే ముందస్తు ఎన్నికల ప్రకటన చేయొచ్చనే వార్త జోరుగా షికారు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ కాలం మే 2019తో పూర్తవుతుంది. అయితే ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి డిసెంబరులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ కూడా ఎన్నికలకు వెళ్లేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
ముందస్తు ఎన్నికలు వచ్చినా గెలిచి తీరుతామనే ఆత్మవిశ్వాసంతో టీఆర్ఎస్ వర్గాలున్నాయి. ఇప్పటికీ కేసీఆర్ తెలంగాణలో పవర్ఫుల్ లీడర్ అని సామాన్యులు భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. గత 50 నెలల్లో కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు మరింత చేరువైనట్లు టీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఇదిలా ఉంటే చివరి నిమిషంలో ఓటరు మనస్సు మారే అవకాశం లేకపోలేదని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు. అందుకే 2019 వరకు కాకుండా... డిసెంబరులోనే ఎన్నికలకు వెళితే బాగుంటుందన్న భావనలో ఆయన ఉన్నట్లు సమాచారం.
మరోవైపు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వారి నుంచి వచ్చిన విజ్ఞప్తిని కూడా కేసీఆర్ తోసిపుచ్చే అవకాశం లేదు. ఒకవేళ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు బీజేపీతో పొత్తుతో వెళితే ఎలాంటి నష్టం చవిచూడాల్సి వస్తుందో కేసీఆర్ ముందుగానే అంచనా వేశారు. అందుకే రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేసి తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఇక తెలంగాణలో 13శాతం ముస్లిం సామాజిక ఓట్లు ఉండగా 2శాతం క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి. 2014లో వీరంతా కేసీఆర్ వైపే మొగ్గు చూపారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కూడా వీరి మద్దతు గులాబీ పార్టీకే దక్కింది. ఒకవేళ టీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు తిరిగే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే కేసీఆర్కు కోలుకోని దెబ్బే మిగులుతుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీతో పొత్తుతో వెళ్లి నష్టం వాటిల్లినా పెద్దగా ప్రభావం చూపబోదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందస్తు మంత్రాన్ని పటిస్తున్నట్లు సమాచారం. లోక్సభలో పొత్తుతో పోయినప్పటికీ పెద్దగా నష్టం ఉండదని ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో వెళితే కేసీఆర్కు షాక్ తగిలే అవకాశముందని హైదరాబాద్లోని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ఓ టీఆర్ఎస్ నాయకుడు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని చెప్పిన ఆయన... లోక్సభ ఎన్నికలకు బీజేపీతో పొత్తు అంశంపై అసెంబ్లీ ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని చెప్పారు. మరోవైపు గ్రామీణప్రాంతాల్లో కాంగ్రెస్ పట్టు సాధిస్తోంది. టీఆర్ఎస్పై దండయాత్రకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గం టీఆర్ఎస్ వెంట నడిచింది. కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దళిత సామాజిక వర్గం కూడా కాంగ్రెస్కే మద్దతు పలికే అవకాశముంది. మైనార్టీలు, రెడ్డి సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం కొంత ఓబీసీ ఓటు బ్యాంకుతో కాంగ్రెస్ టీఆర్ఎస్కు గట్టిపోటీనిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ను మినహాయిస్తే సీఎం కేసీఆర్ టీడీపీని, వైసీపీలాంటి పార్టీలకు ప్రాధాన్యత లేకుండా రాజకీయ చతురత ప్రదర్శించారు. దీంతో టీడీపీ వైసీపీలు కాంగ్రెస్కు మద్దతు పలికే అవకాశం ఉంది.
ఇక కాస్తో కూస్తో ప్రభావం చూపగల లెఫ్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్తో కలిసి పోటీచేసే అవకాశం ఉంది. ఒక వేళ హంగ్ వస్తే హైదరాబాద్ నగరంలో పట్టున్న పార్టీగా పేరుగాంచిన మజ్లిస్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.