సిరిసిల్ల బంద్ ఎఫెక్ట్ : దుకాణం ముందు సేదతీరిన కేసీఆర్ బావ!
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా ఏర్పాటు ఆందోళనలు సీఎం కేసీఆర్ కు స్వయాన బావ అయిన పర్వతనేని రాజేశ్వరరావును ఒకింత ఇబ్బందికి గురిచేశాయి. కేసీఆర్ రెండో అక్క విమలమ్మ భర్త అయిన రాజేశ్వరరావు బుధవారం నాడు ఏదో పని నిమిత్తం సిరిసిల్లకు వెళ్లారు. గతంలో సిరిసిల్లలోనే నివాసమున్న రాజేశ్వరరావు ఈమధ్యే అక్కడి ఇల్లును అమ్మేసుకుని తన నివాసాన్ని హైదరాబాద్ కు మార్చుకున్నారు.
కాగా, కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలంటూ సిరిసిల్లలో రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరిసిల్లను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం నాడు స్థానిక నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో సిరిసిల్ల వెళ్లిన రాజేశ్వరరావు తిరిగి వచ్చే క్రమంలో గాంధీచౌక్ వద్దకు వచ్చి చాలాసేపు బస్సు కోసం నిరీక్షించారు.
ఎంతకీ బస్సులు రాకపోవడంతో.. తమ కారు కోసం ఫోన్ చేశారు రాజేశ్వరరావు. అయితే కారు ధర్మపురి సమీపంలో ఉండడంతో రావడానికి కాస్త సమయం పడుతుందని చెప్పారు. దీంతో చేసేదేమి లేక కొద్దిసేపు ఓ దుకాణం ముందు అలా నడుం వాల్చుకున్నారట. రాజేశ్వరరావును గుర్తించిన స్థానికులు.. తమ ఇంటికి రావాలని పిలిచినా తాను మాత్రం కారు వచ్చేవరకు అక్కడే సేదతీరి వెళ్లిపోయారట.