తనయుల పోరుకు తండ్రులు ఆజ్యం: రంగంలోకి కెసిఆర్, చంద్రబాబు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం మరింతగా వేడెక్కనుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు తనయులు కెటి రామారావు, నారా లోకేష్ తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. ఇక తండ్రుల వంతు వచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలోకి చంద్రబాబుతో పాటు కెసిఆర్ కూడా దిగుతున్నారు. టిఆర్ఎస్ ప్రచారసారథిగా అన్నీ తానై మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. మరోవైపు మూడు, నాలుగు రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రచారపర్వం ప్రారంభించారు.
ఫిబ్రవరి 2న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఈనెల 31న సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచార గడువు ఉంటుంది. అంటే మరో ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ స్థితిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లతో చర్చించి రూట్మ్యాప్ చంద్రబాబు ఖరారు చేశారు. 28న మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. శివారు నియోజకవర్గాల్లో ఆయన ఎక్కువ ప్రచారం చేసే అవకాశాలున్నాయి. కోర్ ఏరియాలోని ఒకటి, రెండు నియోజకవర్గాల్లో కూడా పర్యటన ఉండే అవకాశం ఉంది.

2014లో జరిగిన ఎన్నికల అనంతరం చంద్రబాబు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే ప్రథమం. వరంగల్ ఉపఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం నిర్వహించలేదు. పార్టీకి ఇక్కడ పట్టుండడంతో గ్రేటర్ వార్ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో అగ్రనేత రంగంలోకి దిగుతున్నారు.
ఈ నెల 30వ తేదీన తెరాస బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో కెసిఆర్ పాల్గొనే అవకాశాలున్నాయి. పరేడ్ గ్రౌండ్లో సభ ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి కూడా ఇచ్చింది. సభలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. కాగా, బుధవారం మూడు గంటలకు జరగాల్సిన కెసిఆర్ మీడియా సమావేశం రేపటికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications