ఆ హామిలు ఏమైపోయాయ్?: కేసీఆర్ విస్మరిస్తున్నారా!, నమ్మకం సడలితే కష్టమే..
దళిత సీఎం హామి దగ్గరి నుంచి కేజీ టూ పీజీ ఉచిత విద్య, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, వినాయక సాగర్, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ నెరవ
హైదరాబాద్: ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉన్న సెంటిమెంటు కారణంగా తెలంగాణలో చాలా బలంగా పాతుకుపోయింది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ తో సరితూగే మరో నాయకుడు కూడా కనుచూపు మేరలో కానరాకపోవడం ఆ పార్టీకి మరో పెద్ద బలం.
తెలంగాణ ప్రజలందరిని టీఆర్ఎస్ మా పార్టీ అనుకునే స్థితికి తీసుకురావడంలో సఫలమైంది. అయితే రాజకీయ కాలం గడుస్తున్న కొద్ది మిగతా పార్టీల్లాగే టీఆర్ఎస్ కూడా డొల్లతనాన్ని బయటపెట్టకుంటుండటం ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అంశం. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామిలు అమలు విషయంలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాయి. వీటి ప్రభావం గనుక జనాలపై పడితే పార్టీ పట్ల నమ్మకం సడలే అవకాశాలను కొట్టిపారేయలేం.
దళిత సీఎం హామి దగ్గరి నుంచి కేజీ టూ పీజీ ఉచిత విద్య, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, వినాయక సాగర్, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ నెరవేర్చిన హామిల కన్నా ఇంకా మొదలుపెట్టని పనులే చాలానే ఉన్నాయి.
దళిత సీఎం, దళితులకు మూడెకరాల హామి:
2014ఎన్నికలకు ముందు.. అంతకుముందు ఉద్యమ సమయంలోను సీఎం కేసీఆర్ పదేపదే చెప్పిన మాట దళిత సీఎం. తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎంగా దళితులకే అవకాశం ఇస్తామని ఆయన పలు వేదికల మీద ప్రకటించారు. కానీ రాష్ట్రం సిద్దించి, ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తన మది నుంచి దళిత సీఎం ఆలోచనను పక్కనపెట్టేశారు.
ఇక దళితులకు మూడెకరాల భూమి హామి విషయంలోను ప్రభుత్వం తన డొల్లతనాన్ని బయటపెట్టుకుంది. నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం తూతూ మంత్రంగానే దీన్ని చేపట్టింది. ఇప్పటిదాకా దీని ద్వారా లబ్ది పొందిన దళితులు రాష్ట్రంలో చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ:
కాంట్రాక్టు హామీల క్రమబద్దీకరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఒక్క సింగరేణిలోనే 26వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. తమను రెగ్యులర్ చేయాలంటూ ఇటీవలే యాజమాన్యంతో చర్చలకు సిద్దమయ్యారు. తీరా యాజమాన్యం చర్చలకు హాజరుకాకపోవడంతో వారిలో అసంతృప్తితో గూడుకట్టుకుపోయింది.
ఇందిరాపార్క్ లో వినాయకసాగర్:
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాలన్ని హుస్సేన్ సాగర్ లోనే ఎక్కువగా జరుగుతాయి. దీంతో హుస్సేన్ సాగర్ లోప్రతీ ఏటా కాలుష్యం పాళ్లు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా పక్కనే ఉన్న ఇందిరా పార్క్ లో వినాయక సాగర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.
2016లోనే దీన్ని పూర్తి చేసి హుస్సేన్ సాగర్ లో జరిగే నిమజ్జనాలను అటువైపు తరలించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ప్రభుత్వం మళ్లీ దీనిపై అంతగా శ్రద్ద పెట్టడం లేదని అర్థమవుతోంది. ఈ ఏడాది వినాయక చవితికి కూడా ఇంకా కొద్ది నెలలే ఉండటంతో.. ఈ సంవత్సరం కూడా వినాయక నిమజ్జనాలు హుస్సేన్ సాగర్ లోనే జరుగుతాయేమో!
ప్రక్షాళన మాట ఏది?
హుస్సేన్ సాగర్ ను పూర్తిగా క్లీన్ చేసి దాన్ని మంచి నీటి చెరువుగా చేస్తానని కేసీఆర్ ఎన్నికల సమయంలో చెప్పారు. అందులో మొదటి చెంబు నీళ్లు కూడా తానే తాగుతానని మరీ చెప్పారు. తొలుత ఈ పనులపై కొంత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం సాగర్ లోని నీటిని ఖాళీ చేసే ప్రయత్నం చేసింది.
అయితే సాగర్ నీటిని ఖాళీ చేస్తే.. అందులో నుంచి విషపూరిత రసాయన వాయువులు వెలువడుతాయని కొంతమంది గట్టిగా హెచ్చరించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తర్వాత మళ్లీ దానిపై ఫోకస్ చేయలేదు. ఆవిధంగా ఈ హామి కూడా భవిష్యత్తులోను నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.
హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై టవర్స్:
హుస్సేన్ సాగర్ చుట్టూ వంద ఎకరాల్లో స్కై టవర్స్ నిర్మిస్తామని ప్రకటించిన కేసీఆర్.. దీన్ని కూడా అంతగా పట్టించుకున్న దాఖలా లేదు. ఇప్పుడైతే అసలు దీని ఊసే ఎక్కడా వినిపించడం లేదు. ఈ లెక్కన హుస్సేన్ సాగర్ చుట్టు ఆకాశ హర్మ్యాలను నిర్మించడం అన్నది కలే అనుకోవాల్సిన పరిస్థితి.
కేజీ టూ పీజీ, ప్రైవేటు యూనివర్సిటీలు :
ఓవైపు కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తామని హామి ఇచ్చిన కేసీఆర్.. అదే సమయంలో ప్రైవేటు యూనివర్సిటీల ప్రతిపాదనను తెర పైకి తీసుకొస్తున్నారు. ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకురావడమంటే ప్రభుత్వం విద్యా బాధ్యతల నుంచి పక్కకు తప్పునట్లే. మరి ఏ లెక్కన కేసీఆర్ సర్కార్ ఈ దిశగా ఆలోచన చేస్తుందోనన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక కేజీ టూ పీజీ అమలు కూడా ఆచరణలో అంత వేగవంతం లేదన్న ఆరోపణలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల పేరుతో వేలకోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.. అవి కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యాయన్నవిమర్శలున్నాయి. మరి ఇన్ని విమర్శలను ఎదుర్కొని వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ప్రజలకు ఏవిధంగా జవాబుదారీగా నిలబడుతుందో వేచి చూడాలి.