గవర్నర్ను కలిసిన కెసిఆర్, రేపు ఢిల్లీకి: చండీయాగానికి మోడీకి ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. తాను నిర్వహించనున్న చండీయాగంకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు.
డిసెంబర్ నెలలో కెసిఆర్ విశ్వశాంతి కోసం చండీ యాగం చేయనున్నారు. మరోవైపు, కెసిఆర్ సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. నీతి అయోగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తాను డిసెంబర్లో చేసే చండీ యాగానికి ప్రధాని మోడీని ఆహ్వానించనున్నారు. ఆయన రేపటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారు.
నల్గొండలో స్టేడియం: జగదీశ్వర్ రెడ్డి
నల్గొండలో త్వరలోనే టేబుల్ టెన్నిస్ స్టేడియంను నిర్మిస్తామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడల వల్ల విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు.
పేదల సంక్షేమమే లక్ష్యం: ఈటెల
పేదల క్షేమమే తమ ప్రభుత్వం లక్ష్యమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో అన్నారు. హుజురాబాద్లోని గణేష్నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఐడీహెచ్ కాలనీ తరహాలో ఇళ్లు కట్టిస్తామన్నారు. గతంలో ఊరి బయట మురికి కూపాల మధ్య ఇళ్లు కట్టించేవారని, తమ ప్రభుత్వం నగరంలోనే కట్టిస్తుందన్నారు. పేదల కోసం పని చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.